కొనసాగుతున్న కరోనా కల్లోలం- 24 గంటల్లో 3.37 లక్షల కేసుల నమోదు : ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా..!!
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరగకపోవటం మాత్రం కొంత రిలీఫ్ ఇస్తోంది. ముందు రోజు కంటే పది వేల కేసులు తగ్గినా .. మరోసారి మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యారు. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 10,050 కి చేరింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,13,365 గా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో రికవరీ రేటు 93.31 గా నమోదైంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 17.22గా రికార్డు అయింది.
కేసుల్లో స్వల్ప తగ్గుదల
ఇదే సమయంలో 2,42,676 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశ వ్యాప్తంగా 61.16 కోట్ల మంది వ్యాక్సిన్ పంపిణీ చేసారు. అత్యధికంగా మహారాష్ట్రంలో 48,720, కర్ణాటకలో 48,049, కేరళలో 41,668, తమిళనాడులో 29,870, గుజరాత్ లో 21,225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రిజిస్టర్ అయిన కేసుల్లో 56 శాతం కేసులు ఈ అయిదు రాష్ట్రాల్లోనే రికార్డు అయ్యాయి. మహారాష్ట్రలో 14.29 శాతం కేసులు రిజిస్టర్ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 488 మరణాలు నమోదయ్యాయి.
వేగంగా వ్యాక్సినేషన్
ఇదే సమయంలో 67,49,746 డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. మొత్తంగా 161 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇక, 19,60,954 శాంపిల్స్ పరీక్షించారు. కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించింది. తమిళనాడులో 23వ తేదీన పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా పెరుగుదల
విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు నమోదయ్యాయి.కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది. తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఇద్దరు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.