వలస కూలీల కష్టాలు బీజేపీ తప్ప దేశమంతా చూస్తోంది: సోనియా గాంధీ విమర్శల దాడి
న్యూఢిల్లీ: వలస కూలీలు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని.. అయితే బీజేపీ ప్రభుత్వానికి మాత్రం వారి కష్టాలు కనబడటం లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై గురువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఆమె ఈ మేరకు స్పందించారు.
వలస కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయొద్దు, భోజనం, వసతి కల్పించండి: సుప్రీంకోర్టు
'వలస కార్మికుల బాధను అందరూ చూశారు. వారి ఏడుపులు విన్నారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఇంకా చూసినట్లు లేదు. రానున్న ఆరు నెలల కాలానికి ప్రతి పేద కుటుంబానికి కేంద్రం రూ. 7500 అందించి ఆదుకోవాలి. అలాగే ఇళ్లకు చేరుకోవడానికి సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలి' అని సోనియా గాంధీ కోరారు.
కరోనా లాక్డౌన్లో పేదలు, వలస కూలీలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను 'స్పీక్అఫ్' ప్రచారం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తోంది. ఈ ప్రచారంలో భాగంగానే సోనియా గాంధీ తాజాగా వీడియోను విడుదల చేశారు.
ఇది ఇలావుండగా, వలస కూలీల ప్రయాణాలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికుల ప్రయణాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రైళ్లు, బస్సుల్లో ఛార్జీలు వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఛార్జీలను భరించాలని స్పష్టం చేసింది.
అంతేగాక, తమ రాష్ట్రాల నుంచి వెళుతున్న వలస కార్మికులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించింది. రైల్వే స్టేషన్ చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలకు భోజనం, నీరు అందించాలని, రైలు ప్రయాణంలో రైల్వే శాఖ ఆహారం, నీరు అందించాలని పేర్కొంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులను ఎవరూ ఆపకూడదని స్పష్టం చేసింది.