ప్రపంచ కుబేరుల్లో భారత్కు మూడో స్థానం.. దేశంలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీయే!
న్యూఢిల్లీ: చైనా, అమెరికా తరువాత మనదేశంలోనే ఎక్కువమంది సంపన్నులు ఉన్నారట. గురువారం వెలువడిన 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2018' ప్రకారం... ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల డాలర్లు (బిలియన్) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారి సంఖ్య 131. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది ఈ జాబితాలో చేరారు.
అత్యంత సంపన్నులు అధికంగా కలిగిన దేశాల జాబితాలో కమ్యూనిస్టు చైనా.. అమెరికాను దాటవేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బిలియనీర్లలో 819 మంది చైనాలో ఉండగా, అమెరికాలో 571 మంది మాత్రమే ఉన్నారు. గత ఏడాది ఈ విషయంలో ఈ రెండు దేశాలూ దాదాపు ఒకేలా ఉన్నా.. చైనా ఈ ఏడాది మాత్రం అమెరికాను మించిపోయింది.
అత్యంత ధనికుడు.. అమెజాన్ అధినేతే...
గురువారం వెలువడిన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2018' ప్రకారం... ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడు ఎవరంటే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఈయన ఈ ఏడాది 123 బిలియన్ డాలర్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 102 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండో స్థానంలో హ్యాత్ వే బెర్క్షైర్ అధినేత వారెన్ బఫేట్, 90 బిలియన్ డాలర్ల ఆస్తులతో మూడో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ నిలవగా.. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ 79 బిలియన్ డాలర్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు.
మనదేశంలో మళ్లీ ముకేశ్ అంబానీయే...
ఇక మనదేశంలో అంత్యంత సంపన్నుడు మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా 45 మిలియన్ డాలర్ల (
సుమారు 2.92 లక్షల కోట్లు) ఆస్తులతో ముకేశ్ అత్యంత సంపన్నుడుగా నిలిచారు. గత ఏడాదితో పోల్చుకుంటే ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 73 శాతం పెరిగింది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. రంగాల వారీగా చూస్తే మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో 19 మంది ఫార్మా రంగానికి, 14 మంది ఆటోమొబైల్ రంగానికి, 11 మంది కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
రెండో స్థానంలో గౌతమ్ అదానీ...
దేశంలోకెల్లా అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి గౌతమ్ అదానీ. గత ఏడాదితో పోల్చుకుంటే అదానీ ఆస్తులు ఈ ఏడాది 109 శాతం పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచంలోని కుబేరుల జాబితాలో అదానీ 98వ స్థానంలో ఉన్నారు. ప్రవాస భారతీయ సంపన్నులను కూడా కలుపుకుంటే అత్యంత సంపన్నులైన భారతీయ బిలియనీర్ల జాబితా 170కి చేరుతుంది. అప్పుడు దాదాపు 18 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్.. ముకేశ్ అంబానీ తరువాత రెండో అత్యంత సంపన్నుడైనా భారతీయుడవుతారు.
ప్రపంచ జీడీపీలో 13.2 శాతం వీరి దగ్గరే...
ప్రపంచంలోని 68 దేశాల్లో 100 కోట్ల డాలర్ల (బిలియన్ డాలర్లు)కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు 2,694 మంది, కంపెనీలు 2,157 ఉన్నాయి. వీరి సంపద మొత్తం విలువ 10.5 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.682.5 లక్షల కోట్లు). ప్రపంచ జిడిపిలో ఇది 13.2 శాతానికి సమానం. గత ఏడాది కాలంలోనే ఈ కుబేరుల సంపద విలువ 31 శాతం పెరిగింది. ఇక మనదేశం విషయానికొస్తే.. రంగాల వారీగా చూస్తే మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో 19 మంది ఫార్మా రంగానికి, 14 మంది ఆటోమొబైల్ రంగానికి, 11 మంది కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
అమెరికాను అధిగమించిన చైనా...
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బిలియనీర్లలో 819 మంది కమ్యూనిస్టు చైనాలో ఉంటే, అమెరికాలో 571 మంది మాత్రమే ఉన్నారు. గత ఏడాది ఈ విషయంలో రెండు దేశాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల హవాతో ఈ సంవత్సరం చైనా ఈ విషయంలో అమెరికాను మించిపోయింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ రూ.70 వేల కోట్ల సంపదతో దేశంలోని టాప్ టెన్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడం. దీనినిబట్టి దేశ వాణిజ్యంలో పతంజలి గ్రూపు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.