మా పోరాటానికి మతం రంగు పులుముతారా?: అమెరికా కమిషన్పై ఇండియా మండిపాటు
న్యూఢిల్లీ: అంతర్జాయతీ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా విభజించి కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించడం అవాస్తవమని తేల్చి చెప్పింది.
తప్పుడు కథనాలను ఆధారంగా చేసుకుని..
కరోనా మహమ్మారిపై పోరుకు మతం రంగు పులమొద్దని అమెరికా కమిషన్కు ఘాటుగా జవాబిచ్చింది. కాగా, అహ్మదాబాద్లో మతం ఆధారంగా కరోనావైరస్ బాధితులకు వేర్వేరు చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరగడంతో.. ఈ తప్పుడు కథనాలను ఆధారంగా చేసుకుని యూఎస్సీఐఆర్ఎఫ్ మనదేశంపై విమర్శలు చేసింది. అలాంటి చర్యలు కొందరిని దూరం చేస్తాయని, కరోనావైరస్ను వారే వ్యాప్తి చేస్తున్నారన్న అసత్య వార్తలు సమస్యలు తెచ్చిపెడతాయి అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానమిచ్చింది.
ఘాటుగా స్పందించిన భారత్..
భారత్లో మత స్వేచ్ఛపై ఇప్పటి వరకు చేసిన రాద్ధాంతం సరిపోలేదా? కరోనా బాధితులకు మతం ఆధారంగా చికిత్స చేస్తున్నారన్న అసత్య వార్తలను యూఎస్సీఐఆర్ఎఫ్ వ్యాప్తి చేస్తోందని మండిపడింది. కరోనాపై తమ పోరాటంకు మతం రంగు పులమడం ఆపాలని హితవు పలికింది.
అలాంటిదేం జరగలేదు..
తమ లక్ష్యం నుంచి పక్కకు వెళ్లేలా చేయొద్దంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో మతం ఆధారంగా వైద్యం అందిస్తున్నారన్న ఆరోపణలపై ఆస్పత్రి వైద్యులు కూడా ఖండించారు. వ్యాధి తీవ్రతను బట్టి మాత్రమే చికిత్సను అందిస్తున్నామని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, భారతదేశంలో ఇప్పటి వరకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు 12,759 నమోదు కాగా, 420 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికాలో 28వేల మందికిపైగా చనిపోగా, లక్షా 30వేల మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతుండటం గమనార్హం. కరోనా కట్టడికి ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను కూడా భారత్.. అమెరికాకు ఇటీవల పంపిన విషయం తెలిసిందే.