భారత్ అవకాశాల గని.. మీకిదే ఆహ్వానం - ఇండియా ఐడియాస్ సదస్సులో ప్రధాని మోదీ.. యూఎస్ఐబీసీ ఆధ్వర్యంలో..
''విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో ఇండియా గతంలో కంటే వేగంగా వ్యవహరిస్తున్నది. 2019-20 ఏడాదికి గానూ మాకు 74 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 20 శాతం పెరుగుదల. ఇండియా అవకాశాల గనిగా మారిందనడానికి ఇదొక నిదర్శనం. ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడులపై 49 శాతంగా ఉన్న క్యాప్ ను సవరించి 100 శాతం ఎఫ్ డీఐకి అనుమతులిచ్చాం. భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్యవేత్తలకు స్వాగతం పలుకుతున్నాం..'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఇండియా ఐడియాస్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కరోనా పరిస్థితుల కారణంగా వర్చువల్ విధానంలో ఈ ఏడాది సదస్సు జరిగింది. యూఎస్ఐబీసీ ప్రారంభమై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ''బిల్డింగ్ బెటర్ ఫ్యూచర్'' థీమ్ తో కొనసాగుతోన్న ఈ ఏడాది సదస్సుకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
ఇండియాలో అవకాశాల విషయానికొస్తే టెక్ రంగాన్ని ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంటుందని, ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంటోదన్న రిపోర్టులు ఇక్కడి అవకాశాలను ప్రతిబింబిస్తున్నదని ప్రధాని మోదీ చెప్పారు. టెక్నాలజీ రంగానికి సంబంధించి 5జీ, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్-చైన్ తదితర అంశాల్లో అవకాశాలకు కొదువ లేదన్నారు. అలాగే, క్లీన్ ఎనర్జీని పెంపొందించే గ్యాస్ ఆధారితర రంగాల్లోనూ పెట్టుబడులకు భారత్ ఆహ్వానం పలుకుతోందని, యుఎస్ కంపెనీలకు ఇదొక చక్కటి అవకాశమని తెలిపారు.
''దేశీయంగా ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక గమనాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చు. అన్ని దేశాలు స్థానికంగా తయారీ, ఆరోగ్య రంగాలను మెరుగుపర్చుకోవడం ద్వారా లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. అందుకోసమే మేం 'ఆత్మనిర్భర్' పేరుతో స్వదేశీ విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ మానవాళికి చక్కటి భవిష్యత్తు అవసరమని మనమంతా ఆశిస్తున్నాం. అందుకోసం మనందరం సమిష్టిగా కృషిచేయాలి. హ్యూమన్ సెంట్రిక్ విధానమే భవిష్యత్తు పట్ల భరోసా కల్పించగలదని నేను బలంగా నమ్ముతున్నాను. గడిచిన ఆరేళ్లలో ఇండియా అవకాశ గనిగా ఎదిగింది. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Recommended Video
ఇండియా ఐడియాస్ సదస్సులో ప్రధాని మోదీతోపాటు అమెరికా ప్రభుత్వ విధానకర్తలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులూ పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, వర్జీనియా సెనేటర్ మార్క్ వార్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలి తదితర ప్రముఖులు కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తున్నారు. కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నవేళ అమెరికా, భారత్ మధ్య సహకారం, భవిష్యత్ సంబంధాలపై నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.