చైనాకు మరో గట్టి షాక్ ఇవ్వనున్న భారత్... ఈసారి వీసాలు,విద్యా సంస్థలపై...
చైనాకు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. భారత్లో అడుగుపెట్టాలనుకునే చైనీయులకు ఇకపై వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా చైనీయుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులపై మరింత లోతైన పరిశీలన జరపనుంది.
ఇకపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తేనే చైనా వ్యాపారవేత్తలు,అకడమిక్స్,ఇండస్ట్రీ నిపుణులు తదితరులకు భారత్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ఇప్పటివరకూ ఇలాంటి వీసా నిబంధనలు పాకిస్తాన్పై భారత్ అమలుచేస్తూ వచ్చింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇప్పుడు చైనా పట్ల కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని భారత్ యోచిస్తోంది.
అంతేకాదు,దేశంలోని యూనివర్సిటీలతో చైనా లింకులను కూడా సమీక్షించాలని భారత్ యోచిస్తోంది. అదే జరిగితే చైనీస్ విద్యా సంస్థలతో స్థానిక యూనివర్సిటీల టైఅప్స్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇరు దేశాల విద్యా సంస్థల మధ్య కుదిరిన 54 అవగాహన ఒప్పందాలను ప్రస్తుతం భారత్ సమీక్షిస్తోంది. ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ,బనారస్ హిందూ యూనివర్సిటీ,జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో పాటు చైనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఆఫీస్ హన్బన్తో సంబంధాలున్న పలు విద్యా సంస్థలు ఉన్నాయి.
మరోవైపు, చైనా పోటీదారుగా ఉన్న 44 సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల టెండర్ ప్రక్రియను కూడా భారత్ రద్దు చేసింది. త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని స్పష్టం చేసింది. భారత గడ్డపై చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Recommended Video
కాగా,తూర్పు లదాఖ్లోని గాల్వన్ వ్యాలీలో జూన్ 15న 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారత్ చైనా దూకుడుకు చెక్ చెప్పే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా టిక్టాక్ సహా 59 చైనీస్ యాప్స్పై నిషేధం విధించింది. భారత కస్టమర్ల ప్రైవసీ,సెక్యూరిటీకి ఈ యాప్స్ భంగం కలిగించేవిగా ఉన్నాయన్న అనుమానాలతో నిషేధం విధించారు. అటు 5జీ ట్రయల్స్లోనూ చైనీస్ కంపెనీలైనా హువావే,జెడ్టీఈలను పక్కనపెట్టాలని భారత్ యోచిస్తోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్ హువావే,జెడ్టీఈలను తమ 5జీ ప్రాజెక్టుల నుంచి పక్కనపెట్టేశాయి.