భారత్ ఓ ఆదర్శవంతమైన దేశం..! అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన..!!
ఢిల్లీ/హైదరాబాద్ : అత్యంత క్లిష్ట సమయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారత దేశ పౌరులు తమ ఉన్నత పరిపక్వతను చాటుకున్నారని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అభివర్ణించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర ప్రపంచ దేశాలకు భారత దేశం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వేగంగా అభివృధ్ది చెందుతున్న దేశంగా, స్వేఛ్చాయుత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, నిర్ణయాత్మకత, భిన్నత్వంలో ఏకత్వం చాటే తరుణంలో ఆయా దేశాలకు భారత దేశాన్ని ఓ ఆదర్శవంతమైన దేశంగా చూపగలిగామని మోదీ చెప్పారు.
అలీన దేశాల శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన నరేంద్ర మోదీ, భారత దేశ వ్యక్తిగత అవసరాలు ఎన్ని ఉన్నా, కరోనా వైరస్ వంటి విపత్కర తరుణంలో 123 దేశాలకు వైద్య సాయం అందించగలిగామని, వీటిలో నామ్ సభ్యత్వ దేశాలు సుమారు 53 ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు తాము అన్ని దేశాలతో సమన్వయంగా, సహకార రీతిలో వ్యవహరించాం, వ్యవహరిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో భారత దేశం వైద్య సంబంధమైన అనుభవాలను పంచుకునేందుకు ఆన్ లైన్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో ప్రాచీన కాలం నుంచే వస్తున్న ఆయుర్వేద వైద్య ప్రాశస్త్యాన్ని ఆయన ఊటంకించారు. భారతదేశంలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభిస్తున్నాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముప్పయ్ దేశాల అధినేతలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్-19 ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఓ డిక్లరేషన్ ని ఈ సదస్సులో ఆమోదించారు. కరోనా క్లిష్ట సమయంలో వైరస్ నుండి ప్రాణనష్టం సంభవించకుడా ఉండేదుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలు దేశాలు ప్రసంశించాయి.