వాహ్.. అమిత్ షాజీ.. పొలిటికల్ గేమ్ బాగా ఆడారు.. ఇరుగుపొరుగును చేర్చుకోడానికి ఇండియా ధర్మసత్రంకాదు..
దేశంలో అసలు సమస్యలనుంచి జనం దృష్టి మరల్చడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పేరుతో కేంద్రం డ్రామాలాడుతున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఇరుగుపొరుగు వాళ్లందరినీ చేర్చుకోడానికి దేశమేమీ ధర్మసత్రం కాదన్నారు. అక్రమ వలసలు అనే సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందేనన్న ఆయన.. ఆ పనిని రాష్ట్రాల స్థాయిలో చేపడితే సరిపోతుందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్ఆర్సీ చేపట్టం అసాధ్యమన్నారు.
పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్, మాజీ సీఎం సిద్దూకు నో ఎంట్రీ, బెంగళూరులో !
అమిత్ షాకు కంగ్రాట్స్
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కంగ్రాట్స్ చెప్పాల్సిందేనని, ఎంతో కీలకమైన పొలిటికల్ గేమ్ ను ఆయన చాలా బాగా ఆడారని రాజ్ ఠాక్రే సెటైర్ వేశారు. కేంద్రం నిర్ణయాల వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయేమో అనేంత స్థాయిలో ఆందోళనలు చోటేచేసుకుంటున్నాయన్నారు.
ఆధార్ ఉండగా.. ఎన్ఆర్సీ ఎందుకు?
దేశంలో ఓటు హక్కు దగ్గర్నుంచి ప్రతిదానికి ఆధార్ కార్డును ఆధారంగా వాడుతున్నప్పుడు.. ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి మరోసారి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని ఎంఎన్ఎస్ చీఫ్ అభిప్రాయపడ్డారు. సీఏఏతో భారతీయ ముస్లింలెవరూ భయపడాల్సిన అవసరంలేదని, దీనికిగానీ, ఎన్ఆర్సీకిగానీ మతం రంగులు పూయాల్సిన పనిలేదన్నారు.
అవును.. అక్రమ వలసలు పెద్ద సమస్యే.. కానీ..
అక్రమ వలసలు అనేవి దేశానికి పెద్ద సమస్యలా తయారైన మాట వాస్తవమేనని రాజ్ ఠాక్రే అంగీకరించారు. నేపాల్ బోర్డర్ గుండా ఎంత మంది పాకిస్తానీలు, బంగ్లాదేశీలు ఇండియాలోకి చొరబడ్డారో లెక్కతేలాల్సిందేనన్నారు. అయితే అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి, మున్ముందు జరగకుండా నిరోధించడానికి రాష్ట్రాల స్థాయిలో చట్టాలు చేస్తే సరిపోతుందని ఠాక్రే సూచించారు.