సర్వే సంచలనం: భారత్లో మహిళలకు భద్రత కరువు
భారతదేశంలో స్త్రీని దేవతలా కొలుస్తారు. కానీ అది ఒకప్పుడు. తాజాగా విడుదలైన ఓ సర్వే ప్రకారం భారతదేశంలో మహిళలు ధైర్యంగా జీవించలేరని, ఈ దేశంలో మహిళలకు భద్రత లేదని సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో మహిళలకు భద్రతగా నిలుస్తున్న దేశాలపై సర్వే చేపట్టగా భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశంగా జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది.
థామస్ రైటర్స్ ఫౌండేషన్ 2011లో చేపట్టిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ముందు మూడు స్థానాల్లో వరసగా అఫ్ఘానిస్తాన్, కాంగో, పాకిస్తాన్ దేశాలు నిలిచాయి. ఈ ఏడాది మార్చి 26 నుంచి మే 4వ తేదీవరకు విద్య. ఆరోగ్యం, విధానాల రూపకల్పన, ఎన్జీఓ లాంటి పలు అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న 548 మహిళా నిపుణులను సంప్రదించింది.
మహిళల్లో ఆరోగ్య భద్రత, సంస్కృతి, లైంగిక వేధింపులు, వేరుబంధనం, మహిళల అక్రమరవాణా వంటి అంశాలను పరిగణలోకి తీసుకోమనగా ఇందులో భారత్ అత్యంత ప్రమాదకరంగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.
2012లో నిర్భయ ఘటన జరిగిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహిళలపై అఘాయిత్యాలు మరింత పెరిగిపోయాయని సంస్థ వెల్లడించింది. మహిళలను, అమ్మాయిలకోసం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన భేటీ బచావో-బేటీ పడావో,లాంటి పథకాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని సర్వే తేల్చింది. జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చిన గణాంకాల ప్రకారం మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు 2012 నుంచి 2016 మధ్య 40 శాతం పెరిగినట్లు సర్వే వివరించింది.