భలే వ్యూహం: పాక్ నిఘా విమానం గుట్టు... జపాన్ ద్వారా.. భారత్ చేతికి!
పాకిస్తాన్ వెన్నువిరిచే ఓ వ్యూహానికి భారత్ పదునుపెడుతోంది. ఇప్పటి వరకు భారత్ పై ఆధిపత్యం సాధించానన్న పాకిస్తాన్ ఆనందం, గర్వం ఈ దెబ్బతో ఆవిరికావడం ఖాయం.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెన్నువిరిచే ఓ వ్యూహానికి భారత్ పదునుపెడుతోంది. ఇప్పటి వరకు భారత్ పై ఆధిపత్యం సాధించానన్న పాకిస్తాన్ ఆనందం, గర్వం ఈ దెబ్బతో ఆవిరికావడం ఖాయం.
భారత్-జపాన్లు ఆదివారం యాంటీ సబ్మెరైన్ యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. ఇవి ఏటా జరిగే సాధారణ విన్యాసాల వంటివి కాదు. దీని వెనుక పాకిస్తాన్ ను దెబ్బతీయగలిగే ఓ వ్యూహం దాగి ఉంది.
సాధారణంగా సముద్ర జలాల్లో జరిగే యుద్ధాల్లో జలాంతర్గాములు అత్యంత కీలక పాత్రపోషిస్తాయి. ఇవి రహస్యంగా శత్రువుల నౌకాదళాన్ని ధ్వంసం చేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ అత్యుత్తమ స్థాయి జలంతర్గాములను సమకూర్చుకుంది.
అయితే భారత నౌకాదళ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించిన పాకిస్తాన్ 1996లో అమెరికాలోని లాక్హీడ్ మార్టీన్ నుంచి పి-3సీ ఓరియన్ నిఘా విమానాన్ని కొనుగోలు చేసింది. జలాంతర్గాముల కదలికలను సైతం గుర్తించగలిగే ప్రత్యేక నిఘా వ్యవస్థ ఈ విమానంలో ఉంది.
ఈ నిఘా విమానం ద్వారా పాకిస్తాన్.. భారత్ జలాంతర్గాముల ఉనికిని పసిగడుతుూ ఉండేది. 1996 తర్వాత పాకిస్తాన్ ఈ తరచూ ఈ నిఘా విమానాలను క్రమం తప్పకుండా అప్గ్రేడ్ కూడా చేయించింది.
ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన పి-3సీ యుద్ధ విమానంలోని వ్యవస్థల పనితీరు తెలుసుకుని దానికి తగినట్లు తన జలాంతర్గాముల సంచారాన్ని మార్చుకొనేలా భారత నావికాదళం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది.
తన వ్యూహంలో భాగంగానే జపాన్తో కలిసి సంయుక్త యుద్ధవిన్యాసాలు చేయాలని భారత్ సంకల్పించింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న పి-3సీ నిఘా విమానాలనే జపాన్ కూడా వినియోగిస్తోంది.
ఈ యుద్ధ విన్యాసాల సందర్భంగా ఇప్పటికే జపాన్ కు చెందిన పి-3సీ నిఘా విమానాలు గోవాలోని ఐఎన్ఎస్ హంసపై దిగాయి. ఈ సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భాగంగా ఇప్పుడు ఈ నిఘా విమానాలను భారత నౌకాదళ సిబ్బంది కూడా ఉపయోగిస్తారు.
ఫలితంగా పాకిస్తాన్ నిఘా విమానంలో ఉండే గుట్టుమట్లన్నీ భారత్ కు కూడా తెలిసిపోతాయి. ఫలితంగా భారత జలాంతర్గాములపై పాకిస్తాన్ నిఘా వ్యవస్థను సైతం బోల్తా కొట్టించే దిశగా తన వ్యూహాలకు భారత్ మరింత పదును పెట్టగలుగుతుంది.
పాకిస్తాన్ వద్ద ఉన్న ఈ రకం నిఘా విమానాలకు అందకుండా మన సబ్మెరైన్లను అప్గ్రేడ్ చేసుకునే అవకాశం భారత్ కు లభిస్తుంది. అదేగనుక జరిగితే పాకిస్తాన్ వెన్ను విరగడం ఖాయం.