నేపాల్లో భారత్ ఆపరేషన్ మైత్రి: ఎయిర్ టెల్ ఫ్రీ కాల్స్, బెదిరిన తేనెటీగలు
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్లో భూకంపం నేపథ్యంలో సహాయక చర్యల కోసం భారత్ 'ఆపరేషన్ మైత్రి'ని ప్రారంభించింది. సహాయక చర్యలను భారత బృందాలు ఆదివారం మరింత వేగవంతం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు పలు బృందాలు రంగంలోకి దిగాయి.
నేపాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా 10 విమానాలను పంపిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయులందరినీ సాయంత్రంలోగా తీసుకోస్తామని ఇండియన్ ఎయిర్ చీఫ్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 550 మంది భారతీయులు తీసుకు వచ్చారు.
టెలికం కంపెనీలు ముందుకు
నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయుల క్షేమం తెలుసుకునేందుకు వారి బంధువులకు టెలికాం కంపెనీలు ఊరటనిచ్చేందుకు ముందుకు వచ్చాయి. నేపాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు ఎయిర్ టెల్ మంచి ఆఫరిచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి 48 గంటలపాటు భారత్లోని ఏ ఎయిర్ టెల్ మొబైల్ నుంచైనా నేపాల్కు ఉచితంగా కాల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
నేపాల్ స్థానిక నెంబర్లతోపాటు హెల్ప్లైన్ నెంబర్లన్నింటికీ ఫ్రీకాల్స్ ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ టెల్ ప్రకటన తర్వాత బీఎస్ఎన్ఎల్ కూడా ఇలాంటి పథకాన్నే ప్రకటించింది. శనివారం అర్థరాత్రి నుంచి మూడ్రోజులపాటు నేపాల్కు చేసే కాల్స్కు లోకల్ కాల్ చార్జీలను వర్తిపంచేస్తున్నట్లు ప్రకటించింది.
జార్ఖండ్లో బెదిరిన తేనెటీగలు
జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్లో వచ్చిన భూప్రకంపనలకు తేనెటీగలు బెదిరాయి. అవి జాతీయ రహదారి 33 పైకి రావడంతో కొద్దిసేపటి వరకు ట్రాఫిక్ స్తంభించింది. పక్కనే ఉన్న ఎల్ఐసీ మూడంతస్తుల భవంలో 24 తేనెపట్టులు ఉన్నాయి. ప్రకంపనలు రావడంతో అవి బెదిరి రోడ్డుపైకి వచ్చాయి.