కరోనా భారత్కు చేసిన డ్యామేజ్ ఎంతో తెలుసా... కేంద్రం బాహుబలి ప్యాకేజీ కూడా సరిపోదు..
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాన్ని తిరిగి చక్కదిద్దేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. అయితే పేరుకే భారీ ప్యాకేజీ తప్ప.. కేంద్రం ప్రత్యక్షంగా ఇచ్చింది రూ.2లక్షల కోట్లకు మించదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాకేజీ సంగతి పక్కనపెడితే.. లాక్ డౌన్ కారణంగా అసలు ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజ్ ఎంతన్న దానిపై ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవడం గమనార్హం. తాజాగా ఎస్బీఐ ఎకోరాప్ దీనిపై ఓ అంచనా రిపోర్ట్ను వెల్లడించింది.
షాకింగ్ : కరోనా నంబర్స్పై సీసీఎంబీ సంచలనం.. అసలు లెక్క 10 రెట్లు ఎక్కువ..
కరోనాతో వాటిల్లిన నష్టమెంత... '
'దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో జిల్లాల వారీగా,జోన్ల వారీగా జీఎస్డీపీ నష్టాన్ని మేము అంచనా వేశాం. కోవిడ్-19 కారణంగా రాష్ట్రాలు మొత్తంగా రూ.30.3లక్షల కోట్ల మేర నష్టపోయాయి. మొత్తం జీఎస్డీపీలో ఇది 13.5శాతం.' అని రిపోర్టులో వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ కంటే ఈ నష్టం మరో 50శాతం ఎక్కువ. అంతేకాదు,దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతున్న మహారాష్ట్ర,తమిళనాడు,గుజరాత్ రాష్ట్రాల్లో జీఎస్డీపీ నష్టం ఎక్కువగా ఉందని.. ఈ రాష్ట్రాల నుంచి జీడీపి కంట్రిబ్యూషన్ గణనీయంగా పడిపోయిందని తేలింది.
ఆ రాష్ట్రాల నుంచి పడిపోయిన 75శాతం ఆదాయం..
మొత్తం జీడీపీ నష్టంలో టాప్-10 రాష్ట్రాల నుంచే 75శాతం(నష్టం) నమోదైందని రిపోర్టులో తేలింది. మహారాష్ట్ర నుంచి 15.6శాతం జీఎస్డీపీ తగ్గగా,తమిళనాడు నుంచి 9.4శాతం,గుజరాత్ నుంచి 8.6శాతం తగ్గింది. జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. ప్రపంచంలో కరోనా కారణంగా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన దేశాల్లో భారత్ 10వ స్థానంలో ఉంది. మొదటి 9 స్థానాల్లో అమెరికా,రష్యా,యూకె,స్పెయిన్,ఇటలీ,బ్రెజిల్,జర్మనీ,టర్కీ,ఫ్రాన్స్ దేశాలున్నాయి.
గత రిపోర్టులో ఏం చెప్పింది..
ఎకోరాప్ గత ఏప్రిల్లో ఇచ్చిన చివరి రిపోర్టులో మొత్తం నష్టంలో 50శాతం రెడ్ జోన్లలోనే ఉంటుందని పేర్కొంది. గ్రీన్ జోన్లు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీస్కు అవకాశం ఉండటంతో అక్కడ తక్కువ నష్టం ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా FY-21 మొదటి త్రైమాసికంలో జీడీపీ నష్టం 40శాతానికి పైనే ఉంటుందని పేర్కొంది. జీడీపీ,జీవీఏ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది.