కరోనా వైరస్ : భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..
కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా స్థానికులైన కుటుంబ సభ్యులు లేదా వారు కలిసినవాళ్లకు సోకడం. మూడో దశ.. కమ్యూనిటీలో వ్యాప్తి చెందడం.. అంటే ఇక్కడ వైరస్ ప్రత్యేకించి ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందని నిర్దారించలేం. అలాగే ఎంతమందికి వ్యాప్తి చెందిందన్నది కూడా అంచనా వేయలేం. చాలామంది భారత్ ఇప్పుడు రెండో దశలో ఉందని భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా అదే చెబుతున్నారు. కానీ భారత్ మూడో దశలోకి అడుగుపెట్టిందని.. కోవిడ్-19 ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ సంచలన విషయం బయటపెట్టారు.
మూడో దశలోకి ప్రవేశించామా..?
అధికారికంగా మనం దీన్ని మూడో దశ అని చెప్పకపోయినా.. ఇది మూడో దశనే అని గిరిధర్ గ్యానీ అభిప్రాయపడ్డారు. ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.రాబోయే 5 నుంచి 10 రోజులు కరోనాను నియంత్రించేందుకు కీలకమని.. ఈ పీరియడ్లో ఇప్పటివరకు లక్షణాలు బయటపడని చాలామందిలో లక్షణాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కొద్దివారాల్లో వైరస్ ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉందని.. తగినన్ని కరోనా వైరస్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు సమయం కూడా లేదని అన్నారు. అంతేకాదు,ఆసుపత్రుల కోసం తగిన శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేరని చెప్పారు.
తగినన్నీ టెస్టింగ్ కిట్స్ లేవు.. టెస్టింగ్లో లోపాలు..
ఇప్పటికీ భారత్ వద్ద తగినన్ని కరోనా టెస్టింగ్ కిట్స్ లేవని గ్యానీ తెలిపారు. ఇప్పటివరకు జ్వరం,జలుబు,దగ్గు.. ఈ మూడు లక్షణాలు ఉన్నవారికే టెస్టులు నిర్వహిస్తూ వస్తున్నారని.. వీటిల్లో ఒకే లక్షణం ఉన్నవారికి ఇప్పటివరకు వైద్య పరీక్షలు చేయలేదని అన్నారు. ఆ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. ఒకవేళ ఏదో ఒక లక్షణంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. రొటీన్ చెక్ కింద భావించి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని చెప్పారు.కరోనా వైరస్ అనుమానంతో వస్తున్నవారికి టెస్టులు చేస్తే ఎక్కడ టెస్టింగ్ కిట్స్ అయిపోతాయేమోనన్న ఉద్దేశంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. కాబట్టి దేశంలో తగినన్ని కరోనా వైరస్ వైద్య పరీక్షలు జరగట్లేదన్నారు. ప్రభుత్వం గనుక వైరస్ చైన్ను విచ్చిన్నం చేయాలన్న విషయంలో సీరియస్గా ఉంటే.. కరోనా టెస్టులపై కచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కరోనా లక్షణాలు బయటపడ్డవారికే టెస్టులు చేయడం సరికాదన్నారు.
ఆసుపత్రుల ఏర్పాటు.. మించిపోతున్న సమయం..
సాధ్యమైనంత త్వరగా కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం.. వీలైనంతమంది నర్సులు,హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా చికిత్సపై శిక్షణ ఇప్పించడం ప్రస్తుతం తమ ముందున్న సవాల్ అని చెప్పారు. కరోనా ఆసుపత్రుల ఏర్పాటు కోసం కొన్ని మెడికల్ కాలేజీ హాస్టళ్లను ఖాళీ చేయించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. కానీ దానికి బదులు చివరి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ను అక్కడే ఉండనిచ్చి.. అత్యవసర సేవల కోసం వారిని కూడా ఉపయోగించడం అవసరమన్నారు. అవసరమైతే వారికి కొద్దిపాటి శిక్షణతో పాటు సర్టిఫికెట్ ఇచ్చి కరోనా ఆసుపత్రుల్లో ఉపయోగించుకోవాలన్నారు.దేశవ్యాప్తంగా చిన్న జిల్లాల్లో అయితే 600 పడకలు,ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అయితే 3వేల పడకలతో కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. హాస్టల్స్,గెస్ట్ హౌజ్లను ఆసుపత్రులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ కరోనా వైరస్ పేషెంట్లను ట్రీట్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలు అవసరమవుతాయని.. ఇప్పుడివన్నీ చేయడానికి తమవద్ద సమయం కూడా తక్కువగా ఉందని చెప్పారు. దానికి తోడు పేషెంట్లను ఆసుపత్రులకు తరలించాలంటే రవాణా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందన్నారు.
మోదీకి వివరించిన గ్యానీ
అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వ్యవస్థాపకుడైన డా.గ్యానీని ప్రభుత్వం కరోనా ఆసుపత్రుల టాస్క్ఫోర్స్కి కన్వీనర్గా నియమించింది. ఇంజనీర్ అయిన గ్యానీ క్వాలిటీ మేనేజ్మెంట్లో పీహెచ్డీ కూడా చేశారు. ఆయన నిర్వహిస్తున్న ఎన్జీఓ సంస్థ ప్రభుత్వానికి హెల్త్ కేర్ పరంగా సలహాలు సూచనలు ఇస్తుంటుంది. మార్చి 24వ తేదీన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్తో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా ఆసుపత్రుల ఏర్పాటు.. క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినప్పుడు.. పైన పేర్కొన్న విషయాలన్నింటిని తాను ప్రధానికి వివరించినట్టు తెలిపారు.