చైనా జనశాస్త్రవేత్త సంచలనం: జనాభాలో ఆ దేశాన్ని మించిపోయిన ఇండియా..
అదే సమయంలో అధికారిక లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 133కోట్లు అని, ఈ లెక్కన జనాభాలో భారత్ చైనాను మించిపోయిందని ఫుక్సియాన్ వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అనగానే.. టక్కున ఎవరికైనా గుర్తొచ్చే పేరు 'చైనా'. కానీ ఇకనుంచి ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో!. జనాభా విషయంలో ఇన్నాళ్లు రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అగ్ర స్థానానికి ఎగబాకిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా చైనాకు చెందిన యి ఫుక్సియాన్ అనే జనశాస్త్రవేత్త(డెమోగ్రాఫర్) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జనాభా విషయంలో భారత్ చైనాను ఎప్పుడో దాటేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది నాటికి చైనా జనాభా 129 కోట్లు అని జాతీయ గణాంకాలు చెబుతున్నాయని, కానీ వాస్తవానికి అంతకంటే 9కోట్లు తక్కువే ఉంటుందని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో అధికారిక లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 133కోట్లు అని, ఈ లెక్కన జనాభాలో భారత్ చైనాను మించిపోయిందని ఫుక్సియాన్ వాదిస్తున్నారు. చైనాలోని విస్కాన్సిన్-మాడిసన్ అనే యూనివర్సిటీకి చెందిన ఈ డెమోగ్రాఫర్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక నుంచి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్నే పరిగణించాల్సి ఉంటుందన్న ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.