మోడీ మళ్లీ వస్తే ఎన్నికలనేవి ఉండవన్న అశోక్ గెహ్లాట్
ఢిల్లీ : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీ మరోసారి ప్రధాని పగ్గాలు చేపడితే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగవని అన్నారు. చైనా - రష్యాల్లాగే భారత్ పరిస్థితి కూడా మారిపోతుందని ఒకే ఒక్క పార్టీ రాజ్యమేలుతుందని అభిప్రాయపడ్డారు.
మోదీనా మజాకా .. చౌకిదార్ విమర్శను కూడా ప్రశంసలా వాడేస్తున్నారు
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
మోడీ హయాంలో ప్రజాస్వామ్యంతో పాటు దేశం కూడా ప్రమాదంలో పడిందని అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ప్రధాని కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు మోడీ ఎంతకైనా తెగిస్తారని, చివరకు పాకిస్థాన్ తో యుద్దం చేసేందుకు వెనకాడరని స్పష్టం చేశారు. ప్రసంగాల్లో మోడీ వాడుతున్న భాషపై గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అత్యున్నతమైన ప్రధాని పదవిలో ఉన్నానన్న విషయాన్ని నరేంద్రమోడీ మర్చిపోతున్నారని చురకలంటించారు.
మోడీ గొప్ప నటుడు
ప్రధాని నరేంద్రమోడీని గొప్ప నటుడిగా అభివర్ణించిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్.. ఆయన తన వాక్పటిమ, నటనతో బాలీవుడ్ లో గొప్ప పేరు తెచ్చుకుంటారని సటైర్ వేశారు. యాక్టింగ్ లోనే కాదు తప్పుడు హామీలివ్వడంతో మోడీని మించిన వారు లేరని విమర్శించారు.
చైనా, రష్యాల్లాగే భారత్ పరిస్థితి
మోడీ మరోసారి ప్రధాని పగ్గాలు చేపడితే చైనా, రష్యా మాదిరిగానే భారతదేశం పరిస్థితి మారుతుందని గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. ప్రజలు మరోసారి ఆయనను ఎన్నుకుంటే.. దేశంలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయే లేదో చెప్పలేమని, చైనా, రష్యాలాగే ఎన్నికలు జరగవచ్చు, జరగకపోవచ్చని గెహ్లాట్ స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక్షులు అవుతారని చెప్పారు. వివిధ దేశాల్లోని ఇండియన్ ఎంబసీలను మోడీ ఎన్నారైల మద్దతు కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన గెహ్లాట్ తప్పుడు హామీలతో జనాన్నిమభ్యపెడుతున్న మోడీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రాజ్యాంగేతర శక్తిగా ఆర్ఎస్ఎస్
బీజేపీ నేతలకు సంయమనం అనే పదానికి అర్థమే తెలియదన్న గెహ్లాట్ అసలు అది వారి డీఎన్ఏలోనే లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగేతర శక్తిలా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ తమ వ్యక్తులను చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.