హౌడీ మోడీ సభ ఫలితం: అమెరికా విస్కీతో పాటు ఈ వస్తువులపై సుంకం తగ్గింపు..?
న్యూఢిల్లీ: అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కొన్ని ఎంపిక చేయబడ్డ వస్తువులపై సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రప్రభుత్వం ఉంది. అక్టోబర్ 21న జరగనున్న సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో గత కొంత కాలంగా వాణిజ్య విబేధాలు నెలకొన్న నేపథ్యంలో భారత్ సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విస్కీ, ఫ్రోజెన్ చికెన్లపై దిగుమతి సుంకం తగ్గిస్తే భారత్లో ఇవి తక్కువ ధరకే లభ్యం అవుతాయి.
విస్కీ, ఫ్రోజెన్ చికెన్లతో పాటుగా వాల్నట్స్, యాపిల్స్, ఇథనాల్, మిల్క్ ఆల్బుమిన్లాంటి ఇతర వస్తువులపై కూడా దిగుమతి సుంకం తగ్గించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయా శాఖలకు దిగుమతి సుంకాల తగ్గింపు కలిగిన జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. అయితే తుది జాబితా మాత్రం అక్టోబర్ 21న జరిగే సమావేశంలో తెలుస్తుందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విస్కీపై ప్రస్తుతం ఉన్న 150 శాతం సుంకాన్ని 30శాతంకు తగ్గించే అవకాశం ఉంది. ఇక ఇతర వస్తువుల అంటే బయో ఫ్యూయెల్, మిల్క్ ఆల్బుమిన్లపై ఉన్న 20శాతం సుంకాన్ని 10శాతంకు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి.
అక్టోబర్ 21న జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే వ్యవసాయం, పశుసంవర్థక, డెయిరీ, ఓషధ శాఖ, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. వీరితో పాటు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ శాఖలు కూడా జాయిన్ అవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ) విషయంలో భారత్ను తొలగిస్తూ ట్రంప్ ఈ ఏడాది జూన్లో నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి వాణిజ్య పరంగా రెండు దేశాల మధ్య కొన్ని విబేధాలు వచ్చాయి. ట్రంప్ నిర్ణయంకు ప్రతీకార చర్యల్లో భాగంగా భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న కొన్ని ఉత్పత్తులపై భారీ సుంకాన్ని విధించింది.
అయితే గత నెలలో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హూస్టన్లో జరిగిన హౌడీ మోడీ సభలో పాల్గొన్నారు. అదే సభలో ఆహ్వానితుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొని ప్రసంగించారు. అక్కడే ఈ విబేధాలకు ముగింపు పలికారు. వాణిజ్య పరంగా ఇరు దేశాలు ఒకరినొకరికి సహకారం అందించుకుంటూ ముందుకు వెళతాయని ప్రకటించాయి. ఇందులో భాగంగానే భారత్ అమెరికా వస్తువులపై సుంకాన్ని తగ్గించేందుకు నిర్ణయించింది.