ప్రపంచంలో భారతే సహనశీలి: వయోలిన్ విద్వాంసులు
తిరువనంతపురం: ప్రపంచంలోనే భారత దేశం అత్యంత సహనశీల దేశమని ప్రముఖ వయోలిన్ విద్వాంసులు పద్మభూషణ్ ఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో భారత్ పైన ఎన్నో దాడులు జరిగాయన్నారు. భారత్ ఎన్ని దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు కూడా అసహనాన్ని ప్రదర్శించలేదన్నారు.
భారత దేశంలో ఎవరి మీద ఎవరైనా, ఏమైనా మాట్లాడుకోవచ్చునని, ఆ స్వతంత్రం ఉందని చెప్పారు. అలాంటి విమర్శలు మీడియాలోను చక్కగా ప్రచురితం అవుతాయన్నారు. వార్తా చానళ్లలో వస్తాయని చెప్పారు. మిగతా దేశాల్లో అలాంటి స్వతంత్రం ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇదొక్కటి చాలు మన దేశం ఎంత సహనశీలంగా ఉంటుందో చెప్పడానికి అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడో ఒకటి రెండు సంఘటనలు జరిగినంత మాత్రాన వాటిని చూపించి భారత దేశంలో అసహనం తీవ్రమైందని చెప్పడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.
మనం ఎంతో ఉన్నత సంస్కారం కలిగిన వాళ్లమని, మన దేశాన్ని అత్యంత శక్తివంతమైనదిగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం కావాలని సూచించారు. కాగా, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గాయకురాలైన తన భార్య కవితా కృష్ణమూర్తితో కలిసి లక్ష్మీనారాయణ గ్లోపల్ మ్యూజిక్ ఫెస్టివెల్ కోసం వచ్చారు.