భారత్ మరో దేశంపై దాడి చేయదు, మా జోలికొస్తే మాత్రం..: మోడీ
న్యూఢిల్లీ: భారత దేశం తనంతట తాను మరో దేశంపై దాడి చేయాలని ఎప్పుడూ చూడదని, ఎవరి భూభాగాలను లాక్కోవాలని ప్రయత్నించదని, అదే సమయంలో ఎవరైనా తమ దేశం మీద దాడి చేసేందుకు వస్తే చూస్తూ ఊరుకోదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఆదివారం ప్రవాస భారతీయ కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన ప్రసంగంలో పాకిస్తాన్ పేరును ఆయన ప్రస్తావించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరి భూభాగాన్ని లాక్కోవాలని భారత్ చూడదన్నారు. తాము ఎప్పుడు ఎవరి పైన దాడి చేయలేదన్నారు.
గత రెండేళ్లలో చూస్తే ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది భారతీయులను, విదేశీయులను రక్షించిందన్నారు. 150 దేశాల్లో భారతీయులు ఉన్నారని, వాళ్లు నీళ్లలాంటి వాళ్లు అన్నారు. పరిస్థితులను బట్టి వాళ్లను వాళ్లు మార్చుకుంటారని ఎన్నారైలను కొనియాడారు.
ఇతరుల కోసం భారతీయులు త్యాగాలు చేశారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఒకటిన్నర లక్షల మంది భారతీయులు అమరులయ్యారని చెప్పారు. కానీ దీనిని మనం గట్టిగా చెప్పలేకపోయామని అన్నారు.
శనివారం నాడు పారికర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇతర దేశాలను ఆక్రమించుకునే ఉద్దేశ్యం అంశంపై పారికర్ స్పందించారు. తమకు మరో దేశాన్ని ఆక్రమించుకోవాలనే కోరిక లేదన్నారు. భగవాన్ శ్రీరాముడు లంకను గెలిచిన అనంతరం దానిని రావణాసురుడి సోదరుడు విభీషణుడికి ఇచ్చారని గుర్తు చేశారు.
అలాగే బంగ్లాదేశ్ విషయంలో తాము చేసింది అదే అన్నారు. తాము ఎవరికీ చెడు తలపెట్టమని చెప్పారు. కానీ మాకు ఎవరైనా చెడు చేయాలనుకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భారత సైన్యాన్ని హనుమంతునితో పోల్చారు. దాడులు చేసేంత వరకూ భారత సైన్యానికి వారి పరాక్రమం తెలియదన్నారు. ఆర్మీ పైన పారికర్ ప్రశంసలు కురిపించారు.