భారత్ ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు: కేంద్రం మరోసారి క్లారిటీ
న్యూఢిల్లీ: కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపింది. ఇంకా మనదేశం లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్లోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వమే ప్రకటిస్తుంది..
ఒకవేళ దేశం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి వెళితే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటిస్తుందని, తప్పుడు వార్తలను, ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది. కరోనావైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి భారత్ చేరుకుంటుందంటూ ప్రచారం జరుగుతుండటంతో కేంద్రం ఈ విషయంపై రెండోసారి స్పష్టతనిచ్చింది.
కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే..
భారత్ స్టేజ్3(కమ్యూనిటి ట్రాన్స్మిషన్ స్టేజ్)లోకి వెళ్లిందంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. అదంతా తప్పుడు ప్రచారమని, తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రజలు ఖచ్చితంగా పాటించాలి..
అంతేగాక, దేశ ప్రజలంతా కరోనా కట్టడి కోసం లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. పదే పదే చేతులను శుభ్రం చేసుకోవాలని, సామాజికి దూరాన్ని పాటించాలని తెలిపింది. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ అని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని అనుసరిస్తేనే కరోనాను అరికట్టగలమని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు వందశాతం పాటించాలన్నారు.
వెయ్యి దాటిని కరోనా పాజిటివ్ కేసులు.. 29 మంది మృతి
కేంద్ర రాష్ట్రాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రజలంతా ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా కాల్ సెంటర్లను సంప్రదించాలన్నారు. గడిచిన 24 గంటల్లో 92 పాజిటివ్ కేసులు నమోదయ్యాయయని, నలుగురు మృతి చెందారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1071 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. మరో 99 మంది కోలుకున్నారని తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 34,845 మరణాలు చోటు చేసుకోగా, 7,35,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.