విమానాశ్రయాలే టార్గెట్: ఢిల్లీలో నలుగురు ఉగ్రమూకలు..అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ నగరం ఇప్పటికే పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రమూకలు దేశంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను అలర్ట్ చేశారు పోలీసులు. దుర్గ పూజా రామ్లీలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భద్రతను మరింత పెంచారు పోలీసులు.
భవిష్యత్తులో బాలాకోట్ తరహా దాడులు: ఐఏఎఫ్ కొత్త బాస్ ఆర్కే భదౌరియా
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినందుకు గాను ప్రతీకార దాడులకు దిగేందుకు నలుగురు జైషే మహ్మద్ ఉగ్రమూకలు ఢిల్లీకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో 400 నుంచి 500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు మాటు వేసి ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతాదళాలు అలర్ట్గా ఉన్నాయని భారత మిలటరీ వర్గాలు తెలిపాయి.
భారత్లోకి చొరబడి బీభత్సం సృష్టించాలనే గట్టి కోరికతో ఉన్న ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్రసంస్థల్లో శిక్షిణ పొందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వీరంతా బాలాకోట్లోని జైషే మహ్మద్ శిబిరాల్లో శిక్షణ పొందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉంటే దక్షిణ భారతంలో కూడా ఉగ్రవాదులు అలజడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని బోట్లు సముద్రతీరంలో కనిపించగా అందులోనే ఈ ఉగ్రవాదులు వచ్చి ఉంటారనే అనుమానంను భారత ఆర్మీ వ్యక్తం చేసింది.
లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గంలో భారత్లోకి చొరబడి ఉంటారని ఆగష్టులో ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. లష్కరే తొయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా వచ్చి పలు నగరాలకు విస్తరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. వీరు చెన్నై, కోయంబత్తూరు, నగరాలతో పాటు కేరళ రాష్ట్రంలో కొన్ని నగరాలను టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.