పాక్ ప్రధాని లేఖ: న్యూయార్క్లో ఇండియా-పాక్ విదేశాంగ మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం ఏర్పాటుచేయాలన్న పాక్ అభ్యర్థనను కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, షా మహ్మద్ ఖురేషీ భేటీ అవుతారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ భేటీకి సంబంధించిన తేదీ, సమయాలను ఇరు దేశాల ఐరాస శాశ్వత ప్రతినిధుల బృందాలు ఖరారు చేస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సామాన్యుడికి కేంద్రం తీపి కబురు: పొదుపుపై వడ్డీరేట్ల పెంపు
'ఇది కేవలం సమావేశం మాత్రమే. ఇందులో ఎలాంటి అంశాలపై చర్చలు ఉండబోవు. అంతేగాక ఈ సమావేశం వల్ల పాకిస్థాన్పై మా పాలసీ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. సమావేశం కోసం ఎలాంటి అజెండాను సిద్ధం చేయలేదు. పాక్ అభ్యర్థన మేరకే భేటీకి అంగీకరించాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశా(యూఎన్జీఏ)ల్లో భాగంగా సార్క్ దేశాల విదేశాంగ మంత్రులతోనూ సుష్మాస్వరాజ్ సమావేశమవుతారు' అని రవీశ్ కుమార్ వివరించారు.
సెప్టెంబర్ నెలాఖరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత్, పాక్ విదేశాంగ మంత్రుల భేటీ జరగాలని పాక్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం విదేశాంగ మంత్రుల సమావేశానికి అంగీకరించింది.