అమెరికా కన్నెర్ర: రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థకు తొలి వాయిదా చెల్లించిన భారత్
న్యూఢిల్లీ: భారత్ రష్యాల మధ్య ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు తొలి విడతగా 5.2 బిలియన్ డాలర్లను భారత్ చెల్లించింది. దీంతో అమెరికా విధించిన ఆంక్షలను పక్కనబెట్టి భారత్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందానికే ప్రాధాన్యత ఇచ్చినట్లయ్యింది. గతేడాది ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం తొలి విడతలో డబ్బులు చెల్లించిన తర్వాత రెండేళ్లకు ఎస్ -400 క్షిపణి వ్యవస్థలను భారత్కు రష్యా డెలివరీ చేస్తుంది. ఆ తర్వాత మిగతా క్షిపణి వ్యవస్థలు నాలుగేళ్ల సమయంలో డెలివరీ చేయడం జరుగుతుంది.
భారత్తో జరిగిన అతిపెద్ద ఒప్పందాల్లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ అని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వ్లాదిమిర్ డ్రోజ్హోవ్ అని చెప్పారు. రెండు దేశాలు డబ్బులు చెల్లింపులు, సరుకు డెలివరీపై ఒక ఏకాభిప్రాయంకు వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు జరగాలని ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ఒప్పందంలో భాగంగా మొత్తం డబ్బులు ఖచ్చితంగా ఎంత ఉందో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఇక ఎస్-400 కొనుగోలులో భాగంగా భారత్ తొలివిడతగా చెల్లించిన డబ్బులు మొత్తం ఒప్పందం విలువలో 10శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి ఆయుదాలు కొనుగోలు చేయరాదని అమెరికా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. కాట్సా ద్వారా భారత్పై మరిన్ని ఆంక్షలు అమెరికా విధిస్తుందని తెలిసినప్పటికీ భారత్ ముందుకే అడుగు వేసింది తప్పా అమెరికాకు తలొగ్గలేదని రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఎస్-400 క్షిపణి వ్యవస్థ అత్యాధునిక సాంకేతికతో తయారు చేశారు. శతృ దేశాల యుద్ధ విమానాలు జారవిడిచే క్షిపణులను ధ్వంసం చేయగల సత్తా ఈ వ్యవస్థకు ఉంది. అంతేకాదు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను కూడా ధ్వసం చేయగలదు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం గుర్తించగలదు.