ట్రూడో భారత పర్యటనలో ఖలిస్తానీ ఉగ్రవాది! వీసా ఎలా? కేంద్రం సీరియస్.. విందు ఆహ్వానం రద్దు!
న్యూఢిల్లీ: కరుడుగట్టిన సిక్కు వేర్పాటువాది, ఖలీస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్కు భారత వీసా లభించింది. అంతేకాదు, ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం గురువారం సాయంత్రం కెనడా హైకమిషనర్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు కూడా తీవ్రవాది అత్వాల్కు ఆహ్వానం అందింది. దీంతో కేంద్రం సీరియస్ అయింది.
ముంబైలో జరిగిన కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో సతీమణి సోఫీతో ఖలీస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కెనడా ప్రధానితో సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు హల్చల్ చేస్తుండడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ జస్పాల్ అత్వాల్?
1986లో పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్దూపై కెనడాలో హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జస్పాల్ అత్వాల్ను కోర్టు ఉగ్రవాదిగా తేల్చింది. ఈ కేసులో జస్పాల్ కు 20 ఏళ్ల జైలుశిక్ష కూడా విధించారు. జస్పల్ సభ్యుడిగా ఉన్న ఇంటర్నేషనల్ సిక్క్ యూత్ ఫెడరేషన్పై కూడా నిషేధం విధించబడింది. జైలు నుంచి బయటికొచ్చాక జస్పల్ అత్వాల్ కెనడా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటం ప్రారంభించారు. దీనిపై అక్కడి ప్రతిపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి.
ఏకంగా ప్రధాని సతీమణితోనే...
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో సతీమణి సోఫీతో, కెనడా మంత్రి అమర్జీత్ సోహితో ఖలీస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ ఫొటోలు దిగాడు. కెనడా ప్రధానితో అతడు సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు బయటికిరావడంతో కేంద్ర విదేశాంగ శాఖ విస్మయం వ్యక్తం చేసింది. భారత్లో ప్రవేశించేందుకు అసలు జస్పాల్ అత్వాల్ వీసా ఎలా సంపాదించాడు? ముంబైలో కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్న కార్యక్రమానికి అతడెలా వెళ్లగలిగాడు అనే అంశాలపై విచారణకు ఆదేశించింది.
అధికారిక విందుకూ అహ్వానం, రద్దు...
మరోవైపు ముంబైలోని కెనడా దౌత్య కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగే విందు సమావేశానికి కూడా ఖలిస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్కు ఆహ్వానం అందడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భారత ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో జస్పాల్ అత్వాల్కు ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్టు కెనడా దౌత్యాధికారులు ప్రకటించారు. మరోవైపు అసలు కెనడా ప్రధాని అధికారిక బృందంతో అత్వాల్కు ఎలాంటి సంబంధం లేదనీ.. ప్రధాని కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లేదని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
సిక్కు వేర్పాటువాదానికి కెనడా నుంచి నిధులు?
జస్పాల్ అత్వాల్ 1986 కాల్పుల సమయంలో సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్కు యూత్ ఫెడరేషన్లో క్రియాశీలకంగా ఉన్నాడు. అప్పట్లో పంజాబ్ మంత్రిపై జరిగిన హత్యాయత్నంలో అత్వాల్తో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. కెనడాలో సిక్కు వేర్పాటు వాదం బలంగా వేళ్లూనుకోవడం, అక్కడి నుంచి భారత్కు నిధులు అందుతుండడం పట్ల.. భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. సిక్కు వేర్పాటు వాదానికి కెనడాలో కొందరి నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు అందుతుండడంపై సమాధానం చెప్పలేక ఇప్పటికే ట్రూడో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాము ఎలాంటి వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వబోమని ట్రూడో ఇప్పటికే తేల్చిచెప్పారు.
విందు ఆహ్వానం రద్దు చేసేశాం...
కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఖలీస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్కు కెనడా రాయబార కార్యాలయం తొలుత ఆహ్వానం పంపింది. అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారడం, మీడియాలో దీనిపై కథనాలు ప్రసారం కావడంతో పంజాబ్ ప్రభుత్వం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జస్పాల్ అత్వాల్కు పంపిన ఆహ్వానాన్ని కెనడా హైకమిషన్ వెనక్కి తీసుకుంది. ‘అత్వాల్కు పంపిన ఆహ్వానాన్ని కెనాడా హై కమిషన్ రద్దు చేసింది. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన విషయాలపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం..' అని ముంబైలోని కెనడా దౌత్య కార్యాలయం వెల్లడించింది.
వీసా ఎలా సంపాదించాడో తేలాలి...
ఈ విషయమై కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ‘ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు తేలాల్సి ఉంది. ఒకటి ఖలిస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం, రెండు భారత వీసా సంపాదించడం. అయితే తమ పర్యవేక్షణ లోపం వల్లే అలా జరిగిందనీ.. అతడి ఆహ్వానాన్ని రద్దు చేశామని కెనడా స్పష్టంగా చెప్పేసింది. ఇక వీసా విషయానికొస్తే.. అతడు ఎలా వీసా సంపాదించాడన్న దానిపై నేను ఇప్పటికిప్పుడే చెప్పలేను. మా దౌత్యకార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం సేకరించాం..' అని పేర్కొన్నారు. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
క్షమాపణ చెప్పిన కెనడా ఎంపీ...
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత పర్యటనలో ఖలిస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ కనిపించడం, ట్రూడో గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అధికారిక విందుకు సైతం అతడికి ఆహ్వానం అందడంపై కెనడా ఎంపీ రణదీప్ ఎస్ సరాయ్ గురువారం క్షమాపణ చెప్పారు. ఈ తప్పు తనవల్లే జరిగిందని, అతడి అభ్యర్థనను తాను కూలంకషంగా పరిశీలించలేదని, ఇందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా క్షమాపణ కోరారు. కెనడాకు చెందిన మరో మంత్రి క్రిస్టీ డంకెన్ కూడా తీవ్రవాది అత్వాల్కు ఆహ్వానం పంపకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ ఘటనపై తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. దీనికి కారకులైన వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు.