ఒబామా యూ టర్న్?: మత వ్యాఖ్యలపై గట్టిగా స్పందించిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన మత వ్యాఖ్యలకు భారత దేశం ధీటుగా స్పందించింది. భారత్లో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్లు స్పందించారు.
ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే సహనం కలిగిన భారత దేశ చరిత్రను మార్చలేవని చెప్పారు. భారత దేశం వివిధ మతాలు, వివిధ సంస్కృతులు కలిగి ఉన్న దేశమని కేంద్రమంత్రులు వ్యాఖ్యానించారు. ఇక్కడ ముస్లీంలు, జ్యూస్, పారిస్, క్రిస్టియన్స్.. ఇలా అందరు ఉన్నారని చెప్పారు.
జైట్లీ మాట్లాడుతూ.. మతసహనాన్ని ప్రతి ఒక్కరి అంగీకరించాల్సిందేనని చెప్పారు. భారత దేశానికి సహనం ఉందనేందుకు ఇక్కడి వివిధ సంస్కృతులే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అలాంటి (ఒబామా వ్యాఖ్యలు) తగ్గించే మాటలు భారత్ చరిత్రను మార్చలేవన్నారు.
ప్రపంచంలోనే భారత దేశంలో వివిధ మతాలు ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ ఉత్తరాఖండులో అన్నారు. ఇక్కడ ముస్లీంలు, క్రిస్టియన్లు ఉన్నారని, పార్సీలు, జ్యూస్లు కూడా ఉన్నారని చెప్పారు. భారత దేశానికి ఉన్న మరో ఔన్నత్యం.. మతం, కులం, కమ్యూనిటిని బట్టి ఇక్కడ వివక్ష లేకపోవడమన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్, చైనాలు భావించినట్లుగా ఒబామా భారత్ పైన యూ టర్న్ తీసుకున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
కాగా, భారత దేశంలో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా భారత్లో అన్ని రకాల మత విశ్వాసాలు ఎదుర్కొన్న అసహన చర్యలను గాంధీ చూసి ఉంటే జీర్ణించుకోకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.
ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సభలో మత సహనంపై తాను చేసిన వ్యాఖ్యలు అధికార భారతీయ జనతా పార్టీని ఉద్దేశించినవేననే విమర్శలు కొన్ని భారత రాజకీయ పార్టీలు చేశాయి. దీనికి వైట్ హౌస్ రెండు రోజుల క్రితం స్పందించింది. ఒబామా చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి కాదని పేర్కొంది. అనంతరం ఒబామా మరుసటి రోజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత పర్యటనకు వచ్చి వెళ్తూ ఆఖరు రోజున మత సహనం గురించి మాట్లాడిన అగ్రరాజ్యాధిపతి మరోసారి ఆ అంశంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గురువారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్లో ప్రసంగించిన ఒబామా పెరుగుతున్న మత అసహనం గురించి ప్రస్తావిస్తూ భారత్ను ఉదాహరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.
భారత్ను అద్భుతమైన, అందమైన, ఘనమైన భిన్నత్వం కలిగిన దేశం అని పేర్కొన్నారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ అన్ని మతాలూ ఇతర మతాలవారికి లక్ష్యంగా మారాయన్నారు. మతంపై విశ్వాసం ప్రజలతో మంచి చేయిస్తుందని, అదే సమయంలో అదో ఆయుధంలా మారుతుందని అభిప్రాయపడ్డారు.
మత అసహనం ఏ ఒక్క మతానికో, జాతికో చెందినది మాత్రమే కాదని, అందరిలోనూ ఉందన్నారు. మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదన్నారు. క్రైస్తవంలోనూ ఉందని వ్యాఖ్యానించారు. క్రూసేడులు, ఇంక్విజిషన్ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు.
మతం మంచికే అయినా కొందరు తాము చేసే ఘాతుకాల కోసం మతాన్ని హైజాక్ చేస్తారన్నారు. ఈ మత అసహనం మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం కోసం యుద్ధం చేస్తున్నామనుకుంటున్న ఐఎస్ఐఎస్ నిజానికి ఇస్లాంను మోసం చేస్తోందన్నారు. ఈ సభకు హాజరైన టిబెట్ మత గురువు దలైలామాను ఒబామా.. మంచి స్నేహితుడుగా అభివర్ణించారు.