దేనికైనా భారత్ రెడీ: చైనాకు దీటుగా జవాబిచ్చిన నిర్మలా సీతారామన్
డెహ్రాడూన్ : డొక్లామ్లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉద్ఘాటించారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లామ్ సమస్యపై నిర్మలా సీతారామన్ కూడా అంతే ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
శనివారం భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్ క్యూను ఒకవేళ చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లామ్ లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలకు సైతం సరిహద్దులో భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
డొక్లామ్ ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పేర్కొన్నారు. గతేడాది జూన్ 16 నుంచి ఆగష్టు 18 వరకూ చైనా-భారత్ల మధ్య డొక్లామ్ విషయమై తీవ్ర సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.