భారత్లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 16వేలకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మరణాలు కూడా 100కుపైనే నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 8,31,807 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,577 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజాగా, కరోనా బారినపడి 120 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,825కి చేరింది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటలల్లో 12,179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.07 కోట్లకు చేరింది.
ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రేటు మొత్తం కేసుల్లో 1.41 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 21,46,61,465 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది.
కాగా, కరోనా కేసులు కొన్ని కేసుల్లోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతుండటం గమనార్హం. దీంతో దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి.
మరోవైపు, కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంగా కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 25 నాటికి 1,34,72,643 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గురువారం ఒక్కరోజే 8,01,480 మంది టీకా వేయించుకున్నారని తెలిపింది.