నో ఛేంజ్..దేశంలో అదే ఉధృతి: మళ్లీ లక్షా 60 వేలకు పైగా కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. సోమవారం నాటితో పోల్చుకుంటే- తాజాగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ అది నామమాత్రమే. వరుసగా రెండోరోజు కూడా లక్షా 60 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,68,912 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 879 మంది మరణించారు. 97,168 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లక్షన్నరకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడోసారి.
ఆదివారం నుంచి లక్షన్నరకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే ఉధృతి మున్ముందు కొనసాగకపోవచ్చనే గ్యారంటీ ఉండట్లేదు. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దాని ప్రభావం రోజువారీ కేసులపై పడుతున్నాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కు చేరింది. ఇందులో 1,22,53,697 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,71,058 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698కి చేరింది. మృతుల సంఖ్య లక్షా 71 వేలను దాటేసింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది.
ఇప్పటిదాకా 10,85,33,085 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేయాలనే నిబంధన పట్ల పలు రాష్ట్రాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధననను ఎత్తేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 25,92,07,108 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 14,00,122 టెస్టింగులను చేపట్టినట్లు తెలిపింది.