భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: ఈ నెలలో ఫస్ట్టైమ్ ఇంత తక్కువగా: మరణాల్లో మాత్రం అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదివరకు నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మూడు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇదే తొలిసారి. మరణాల్లో మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గట్లేదు. మరోసారి నాలుగు వేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. ఆదివారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే తాజాగా నమోదైన మరణాలు ఎక్కువే.
Recommended Video
CoWin: పోర్టల్లో మార్పులు: కోవిషీల్డ్ రెండో డోసు కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడటమే
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,81,386 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,106 మంది మరణించారు. 3,78,741 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ పాజిటివ్ కేసుల కంటే.. డిశ్చార్జీలు అధికంగా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463కు చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకున్నారు. మరణించిన వారి సంఖ్య 2,74,390కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997గా నమోదైంది. ఇప్పటిదాకా 18,29,26,460 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
ఈ మధ్యకాలంలో మూడు లక్షల దిగువకు కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ఢిల్లీ దాదాపు నెలరోజులుగా సంపూర్ణ లాక్డౌన్లో ఉంటోంది. తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను విధించాయి. ఏపీ వంటి మరి కొన్ని రాష్ట్రాలు పాక్షికంగా లాక్డౌన్ అమలు చేస్తోన్నాయి. లాక్డౌన్కు ప్రత్యామ్నాయంగా రాత్రివేళల్లో కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలను తెరచుకోవడానికి అనుమతి ఇవ్వడం వంటి చర్యలను చేపట్టాయి.
ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిందనే అంచనాలు ఉన్నాయి. మరణాల్లో మాత్రం ఉధృతి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోసారి మృతుల సంఖ్య నాలుగు వేల మార్క్ను అధిగమించింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో అత్యధిక కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల షార్టేజీ, ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు అందుబాటులో లేకపోవడం వంటివి మరణాలు పెరగడానికి కారణమౌతున్నాయి.