లాక్డౌన్ ఎఫెక్ట్: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాల్లోనూ తగ్గుదల: అయినా..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా వాటి సంఖ్య ఒక్కసారిగా తగ్గడం ఊరట ఇస్తోంది. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కూడా తగ్గినట్టే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్ను కఠినంగా అమలు చేస్తోండటం వంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్టయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. మున్ముందు- రోజువారీ కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నారు. ఇదే రికవరి రేటు కొనసాగుతుందని ఆశిస్తున్నారు.
Recommended Video
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,66,161 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,754 మంది మరణించారు. 3,53,818 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. ఇందులో 1,86,71,222 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 2,46,116కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 37,45,237గా నమోదైంది. ఇప్పటిదాకా 17,01,76,603 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
నాలుగైదు రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటుతూ వస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు మరణాల సంఖ్య కూడా నాలుగు వేలకు పైమాటే. అటు రోజువారీ పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు గరిష్ఠ స్థాయిని అందుకున్న సందర్భాలవి. వాటి తీవ్రత మరింత పెరగొచ్చంటూ భావిస్తోన్న వేళ.. ఒక్కసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్షీణించింది. 3,66,161కు చేరింది. ఆదివారం నాటి బులెటిన్ను పరిగణనలోకి తీసుకుంటే- 37,577 కేసులు తగ్గాయన్నమాటే. మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. అదే సమయంలో- పాజిటివ్ కేసులకు సంఖ్యకు దాదాపు సమానంగా డిశ్చార్జీలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 3,53,818 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశ రాజధానిలో కొద్దిరోజులుగా కరోనా వైరస్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఇదివరకు 35 శాతం మేర నమోదైన కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. 23 శాతంగా నమోదవుతోంది. కఠినంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్లే కేసులు తగ్గాయనేది స్పష్టమౌతోంది. మహారాష్ట్ర, తెలంగాణల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ, కర్ణాటకల్లో రోజువారీ కేసుల్లో పెద్దగా మార్పు ఉండట్లేదు. కర్ణాటకలోనూ 40 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతూనే వస్తున్నాయి. ఏపీలో ఈ సంఖ్య 20 వేలకు పైమాటే. కేరళ, తమిళనాడు సంపూర్ణ లాక్డౌన్లో ఉంటున్నాయి. ఇదే వేగంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోలేదని కేంద్రం అంచనా వేస్తోంది.