దేశంలో 40వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు: కేరళలో కొనసాగుతున్న ఉధృతి
న్యూఢిల్లీ: భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదవుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా చాలా తక్కువ కరోనా కేసులు నమోదైన ఢిల్లీలోనూ తాజాగా కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించింది.
దేశంలో కొత్తగా 40,120 కరోనా కేసులు, 585 మరణాలు
గత 24 గంటల్లో దేశంలో 19,70,495 నమూనాలను పరీక్షించగా 40,120 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2.6 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.21 కోట్లు దాటింది. ఇక మరణాలు మరోసారి 500 దాటాయి. శుక్రవారం కరోనా మహమ్మారి బారినపడి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,30,254కు చేరింది.
దేశంలో 3,84,227 యాక్టివ్ కేసులు
శుక్రవారం 42వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనావైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.13 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,227 మంది కరోనాతో బాధపడుతున్నారు. కాగా, గత 24 గంటల వ్యవధిలో 57,31,574 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన కరోనా టీకా డోసుల సంఖ్య 52.95 కోట్లకు చేరింది.
ఢిల్లీలో వరుసగా రెండో రోజూ కరోనా మరణాలు సున్నా
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 49 కరోనా కేసులు నమోదు కాగా, వరుసగా రెండో రోజు కూడా కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.07 శాతంగా ఉంది. సెకండ్ వేవ్ ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలో మరణాలు సంభవించని రోజు ఇది 8వది కావడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలోని ముంబైలో డెల్టా వేరియంట్ ప్లస్ బారినపడి ఓ వృద్ధుడు మరణించాడు. డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో సంభవించిన తొలి మరణం ఇదే. మొత్తం మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కారణంగా సంభవించిన రెండో మరణం ఇది. డెల్టా ప్లస్ వేరియంట్ కూడా వ్యాధిని వేగంగా వ్యాప్తి చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. గురువారం కొత్తగా కేరళలో 21,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 160 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కేరళలో మొత్తం మరణాల సంఖ్య 18,120కి పెరిగింది. పాజిటివిటీ రేటు 14.73 శాతానికి చేరింది. జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల గణాంకాలు ఇలా ఉన్నాయి. మలప్పురం -3300, కోజికోడ్- 2534, త్రిస్సూర్ -2465, ఎర్నాకుళం -2425, పాలక్కాడ్ -2168, కొల్లాం -1333, కన్నూర్- 1338, అలప్పుజ -1238, కొట్టాయం -1188, తిరువనంతపురం- 933, వయనాడ్ -720, పతనమిట్ట -630, ఇడుక్కి -589, కాసరగోడ్ -578 కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో మొత్తం 1,45,582 నమూనాలను పరీక్షించారు. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటకలో వినాయక చవితి నుంచి విజయదశమి వరకు అన్ని పండగలను రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.