రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు: 8లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం.
శుక్రవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. గడిచిన 24 గంటల్లో 475 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 21,604 మంది కరోనా బారిన పడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా దేశంలో మరణాల సంఖ్య సరాసరి 480గా ఉంది.
ఇక దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 4,95,513 మంది కోలుకున్నారు. 2,76,685 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో సమూహ వ్యాప్తి కూడా లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా అత్యధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా ఉంది.
ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 62.09శాతంగా ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మే 31న 47 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 62 శాతానికి పెరిగిందని తెలిపింది. అంతేగాకుండా పది లక్షల జనాభాకు కరోనా కేసులు, మరణాల సంఖ్య భారత్లోనే తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో మనదేశం ఎంతో మెరుగ్గా ఉందని తెలిపింది.
Recommended Video
కాగా, దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో లక్షా 26 కేసులకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లక్షకుపైగా కేసులున్నాయి.