పాక్లో అణు రియాక్టర్లకు చైనా సాయం: భారత్ ఫైర్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్లో కొత్తగా అణు రియాక్టర్లు ఏర్పాటవుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా సహకారంతో కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను పాకిస్థాన్ ఏర్పాటు చేసుకుంటోందని, ఈ విషయంలో భారత దేశ ప్రయోజనాలను కాపాడేందుకు, భద్రతను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ పరిశీలిస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది.
ఎటువంటి సవాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధమని విదేశీ వ్యావహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పాక్లో తయారవుతున్న అణు రియాక్టర్లు భారత భద్రతపై ఎలాంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు.
రెండు అణు రియాక్టర్లకు సరిపడా ఇంధనం, మౌలిక వసతులను చైనా అందించిందని తెలిపిన ఆయన, పాక్లో అణు కార్యకలాపాలు పెరుగుతూ ఉండటం, భారత భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.
పాక్, చైనాల దూకుడు, ఆ రెండు దేశాల మధ్యా కుదురిన ఒప్పందాల గురించి తమకు తెలుసునని చెప్పారు. ఇప్పటికే రెండు రియాక్టర్లు(ఛష్మా-1, ఛష్మా-2) పనిచేస్తుండగా, మరో రెండు రియాక్టర్లు(ఛష్మా-3, ఛష్మా-4) నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అయితే, మన దేశ భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.