ట్రూడో భారత పర్యటనలో షాకింగ్ కోణం! ‘కుట్ర’పై ఇదీ భారత్ స్పందన..
న్యూఢిల్లీ: భారత పర్యటన సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విందుకు ఖలిస్తానీ తీవ్రవాదికి ఆహ్వానం దక్కిన వివాదం చల్లారక ముందే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రూడోకి ఇచ్చే విందులో పాల్గొనే అతిథుల జాబితాను పరిశీలించేందుకు భారత ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదని కెనడా న్యూస్ ఛానెల్ సీటీవీ వెల్లడించింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ రాక సందర్భంగా భారత్లోని కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ ఇచ్చే విందుకు సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగడంతో కెనడా దౌత్యకార్యాలయం అతడి ఆహ్వానాన్ని రద్దు కూడా చేసింది.
ఉక్కిరిబిక్కిరైన ట్రూడో...
తన భారత పర్యటన సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్తో తన భార్య సోఫీ ట్రూడో ఫోటో దిగడంపై వచ్చిన ప్రశ్నలతో కెనడా ప్రధాని ట్రూడో ఉక్కిరిబిక్కిరయ్యారు. అత్వాల్కి ఆహ్వానం అందడంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో... ఈ పొరపాటుకు తనదే బాధ్యత అంటూ కెనడా ఎంపీ రణ్దీప్ ఎస్ సరయ్ క్షమాపణ చెప్పేశారు.
ఇదే మరీ విడ్డూరం...
అయితే ఇండియాలో పర్యటిస్తూ.. ఇండియాలో ఏర్పాటు చేసిన తమ ప్రధాని విందులో పాల్గొనే అతిథుల వివరాలను భారత భద్రతా సంస్థలకు ఇచ్చేందుకు సైతం కెనడా ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించడమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఈ పర్యటనలో తమ భద్రతా సంస్థల పనితీరు భేష్ అంటూ కెనడా ప్రజాభద్రతా మంత్రి అక్కడి అసెంబ్లీలో పేర్కొనడం మరింత విడ్డూరంగా కనిపిస్తోంది.
కుట్రకు ఆధారాలు లేవు...
కెనడా ప్రధాని విందుకు ఖలిస్తానీ తీవ్రవాది జస్పాల్ అత్వాల్ను ఆహ్వానించడం వెనుక ‘కుట్రకోణం' ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఉగ్రవాది అత్వాల్కు భారత వీసా ఎలా దక్కిందన్న దానిపై భారత విదేశాంగ శాఖ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ‘కుట్ర' జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఆ విందుకు మనకు సంబంధం లేదు...
బుధవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ స్పందిస్తూ.... భారత్లో కెనడా ప్రధాని గౌరవార్థం కెనడా హైకమిషనర్ ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలకు అత్వాల్కు ఆహ్వానం అందినట్లు చెప్పారు. దీనిపై కెనడా పార్లమెంటులో జరిగిన చర్చను కూడా తాము చూశామన్నారు. ‘నిజానికి ఆ విందు కార్యక్రమాలు ముంబైలో ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో మరో విందు కార్యక్రమం నిర్వహించింది కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ కాబట్టి.. అందులో అత్వాల్ పాల్గొంటే భారత ప్రభుత్వంగానీ, భద్రతా సంస్థలుగానీ చేయగలిగిందేం లేదు. కానీ అతడి ఆహ్వానాన్ని కెనడా దౌత్య కార్యాలయం రద్దు చేసేసింది. కాబట్టి దీనికి విరుద్ధంగా ఎలాంటి సమాచారం వచ్చినా అవన్నీ అధారంలేనివి, వాటిని అంగీకరించబోం...' అని ఆయన స్పష్టం చేశారు.