సర్జికల్ దాడిపై పాక్ కొత్త ట్విస్ట్, భారత్తో పాటు జర్మనీ షాకిచ్చింది
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ చేయలేదని తొలి నుంచి కథనాలు ప్రచురిస్తున్న పాక్ మీడియా తాజాగా మరో కొత్త కథనాన్ని వండివార్చింది. భారత్ చెబుతున్న దాడులు అంతా బూటకమేనని స్వయంగా భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ అన్నారని కథనం ప్రచురించింది.
అసలు సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదని జర్మన్ రాయబారితో జయశంకర్ అన్నారని రాసుకొచ్చింది. ఈ వార్తను భారత్ ఖండించింది. అది పూర్తిగా నిరాధార కథనమని పేర్కొంది. అంతేకాదు, ఢిల్లీలోని జర్మన్ ఎంబసీ కూడా పాకిస్తాన్ మీడియా వార్తలను ఖండించింది.
పీవోకేలో దాడులుగా చెప్పుకుంటున్నవి సాధారణ కాల్పులేనని మొదటి నుంచి చెప్పుకొస్తున్న పాక్ మీడియా ఈసారి 'విశ్వసనీయ సమాచారం మేరకు' అంటూ కొత్త కథనాన్ని ప్రచురించింది. డాన్ పత్రిక రిపోర్టర్ సిరైల్ అల్మైదాపై ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం ఇతర పత్రికలను కూడా తన దారికి తెచ్చుకున్నట్టు ఈ వార్తతో నిజమనిపిస్తోంది.
పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య చెడిందని అల్మైదా వార్త రాసి సంచలనానికి కారణమైన విషయం తెలిసిందే. తాజాగా పాక్ పత్రిక 'ద న్యూస్ ఇంటర్నేషనల్' రాసిన వార్త అటు ప్రభుత్వాన్ని, ఇటు ఆర్మీని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.
'విశ్వసనీయ సమాచారం ప్రకారం' అని కథనాన్ని మొదలు పెట్టిన పత్రిక 'ఆజాదీ కాశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో జరిగినట్లు చెబుతున్న సర్జికల్ దాడులను జయశంకర్ ఖండించారు. భారత ఆర్మీ అక్కడ ఎటువంటి మెరుపు దాడులకు దిగలేదని అని పేర్కొన్నారు' అని రాసింది. దీనిని భారత్ వెంటనే ఖండించింది. నిరాధార వార్త అని చెప్పింది.
భారత్పై పాక్ బురద
భారత్పై పాకిస్థాన్ మరోమారు బురద చల్లే ప్రయత్నం చేసింది. ఆఫ్గనిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకుని పాక్లో ఉగ్రవాద చర్యలకు భారత్ పాల్పడుతోందని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత్ నేతలే అంగీకరించారని పేర్కొంది. పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి అయిందన్న వార్తలను కొట్టి పడేశాడు. భౌగోళికంగా పాక్ ఇతర దేశాలకు ఎకనమిక్ హబ్గా కొనసాగుతోందన్నాడు. పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకి కాలేదని, అదంతా ప్రచారం మాత్రమే అన్నాడుచ. పాక్ అన్ని దేశాలతో సోదర సంబంధాలు కలిగి ఉందన్నాడు.