షాకింగ్ రిపోర్ట్ : దేశంలో మత స్వేచ్చ దిగజారుతోందా.. ఖండించిన భారత్..
అంతర్జాతీయ మత స్వేచ్చపై అమెరికా కమిషన్(USCIRF) ఇచ్చిన నివేదికలో భారత్పై చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్లో మత స్వేచ్చ దిగజారుతోందని.. ముఖ్యంగా మైనారిటీలపై దాడులు పెచ్చరిల్లుతున్నాయని పేర్కొంది. ఒక పద్దతి ప్రకారం మత స్వేచ్చ పట్ల జరుగుతున్న దాడులను భారత్ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించింది. అంతేకాదు,మత స్వేచ్చకు విఘాతం కలిగిస్తోన్న భారత్ పట్ల అమెరికన్ మార్కెట్లో ఆంక్షలు విధించాలని సూచించింది. తమ వార్షిక నివేదిక-2020లో ఈ వివరాలను వెల్లడించింది. అయితే అమెరికా కమిషన్ చేసిన ఈ విమర్శలను భారత్ తోసిపుచ్చింది.
అమెరికా కమిషన్ నివేదిక పక్షపాత వైఖరితో,భారత్ పట్ల వ్యతిరేకతతో ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఆగ్రహం వ్యక్తం చేశారు. USCIRF ఇలాంటి నివేదికలు ఇవ్వడం ఇదేమీ కొత్త కాదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదికలో చేసిన విమర్శలు మరో స్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ప్రత్యేకించి ఓ సమస్య పట్ల పనిచేస్తున్న ఆర్గనైజేషన్గా దీన్ని చూస్తామని.. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Recommended Video
ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 14 దేశాల్లో మతపరంగా మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా కమిషన్ పేర్కొంది. ఇందులో మయన్మార్,చైనా,ఎరిత్రియా,పాకిస్తాన్,నార్త్ కొరియా,ఇరాన్,సౌదీ అరేబియా,తజకిస్తాన్,తుర్క్మెనిస్తాన్,నైజీరియా,రష్యా,సిరియా,వియత్నాం దేశాలున్నట్టు తెలిపింది. అమెరికా కమిషన్ వైస్ ఛైర్మన్ నదిన్ మాయెంజా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మత స్వేచ్చ పరంగా భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. గడిచిన 15 ఏళ్లలో భారత్ సీపీసీ(దేశంలో ప్రత్యేక ఆందోళన) జాబితాలో చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.