తొలగని కరోనా థ్రెట్: 30 వేలు ప్లస్: జోరుగా వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. కొత్తగా మరోసారి 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదివరకు 25 వేలకు పడిపోయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు రోజులుగా పెరిగాయి. 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా అవి మళ్లీ క్షీణించాయి. 31 వేలకు దిగువగా నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,773 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 38,945 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది కోలుకున్నారు. 4,44,838 మంది వరకు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,32,158గా నమోదైంది.
దేశంలో కొత్తగా 30,773 కేసులు నమోదు కాగా.. ఇందులో కేరళ వాటా సగానికి పైగా ఉంది. కేరళలో గత 24 గంటల వ్యవధిలో 19,325 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. 143 మంది మరణించారు. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 80,43,72,331 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం ఒక్కరోజే 85,42,732 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు.
దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 55,23,40,168 టెస్టింగులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 15,59,895 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,42,655 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు.
భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,91,562, బ్రెజిల్-5,90,547 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. కేరళలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. కొత్తగా 19,325 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఇదివరకు ఈ సంఖ్య భారీగా నమోదవుతూ వచ్చింది. ఆ తరువాత మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది దీని తీవ్రత. మున్ముందు మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు.
కాగా- కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నప్పటికీ.. మాస్కులను మాత్రం ధరించక తప్పదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. 2022 సంవత్సరం పొడవునా మాస్కులను ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంకో సంవత్సరం పాటు కరోనా వైరస్ పోరాటాన్ని కొనసాగించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.