కరోనాపై ఊరట..తగ్గుతోన్న తీవ్రత: తొలిసారిగా 50 వేల కంటే: లక్షా 15 వేలకు పైగా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల రోజువారీ సంఖ్య.. తాజాగా మరింత క్షీణించింది. ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో పడిపోయింది. సుదీర్ఘకాలం తరువాత 50 వేల కంటే దిగువకు రోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలోనూ భారీగా తగ్గుదల రికార్డయింది. మరణాల సంఖ్య సగానికి తగ్గింది. ఇవే పరిస్థితులు ఇక ముందు కూడా కొనసాగుతాయని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆశిస్తున్నారు.
తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు: వెయ్యికి దిగువగా: కోలుకున్న 2 లక్షలమంది
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 46,791 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 587 మంది మరణించారు. ఈ స్థాయిలో రోజువారీ కరోనా కేసులు తగ్గడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఇదివరకు గరిష్ఠంగా 96 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. క్రమంగా దాని తీవ్రత తగ్గుతూ వచ్చింది. 50 వేల కంటే దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే తొమ్మిది వేలకు పైగా కరోనా కేసుల్లో క్షీణత కనిపించింది. మృతుల సంఖ్యలోనూ అదే స్థాయి తగ్గుదల నమోదైంది. ఇదివరకు గరిష్ఠంగా రోజూ 1100 నుంచి 1200 వరకు కరోనా మరణాలు నమోదు అయ్యేవి. ఆ సంఖ్య 600 కంటే దిగువకు పడిపోయింది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,48,538గా నమోదైంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 67,33,329కి చేరుకోగా.. మొత్తం మరణాలు 1,15,197గా నమోదు అయ్యాయి. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే తొలి అయిదు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రతగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దాని ప్రభావం వల్ల జాతీయ స్థాయిలో రోజువారీ కరోన పాజిటివ్ కేసుల్లో తగ్గుదల నమోదవుతోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలల్లో అంచనాలకు మించిన స్థాయిలో కరోనా రేటు తగ్గుతోంది.
Recommended Video
ఏపీలో ఇదివరకు 10 వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యేవి. వాటి సంఖ్య ప్రస్తుతం మూడువేల కంటే కిందికి క్షీణించింది. సోమవారం నాడు అధికారులు జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 2,918 కేసులు నమోదు అయ్యాయి. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోనూ నెలకొంది. దాని ఫలితంగా- జాతీయ స్థాయిలో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో రికవరీ రేటు భారీగా నమోదవుతోంది. ఏపీలో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 2,41,637గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 35,063.