కరోనా కథ మళ్లీ మొదటికి: ప్రధాని మోడీ హెచ్చరికలు.. నిజమే: రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో మళ్లీ పెరుగుదల నమోదైంది. 54 వేలకు పైగా రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల రోజువారీ సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆశిస్తోన్న వేళ.. ఒక్కసారిగా తొమ్మిది వేల వరకు పెరగడం.. పాత కథను గుర్తుకు తెస్తోంది. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టే. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలోనూ ఇదే రకమైన పెరుగుదల రికార్డయింది. మళ్లీ కథ మొదటికి వస్తుందనే సంకేతాలను పంపించినట్టయింది.
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 54,044 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 717 మంది మరణించారు. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే తొమ్మిది వేలకు పైగా కరోనా కేసులు పెరిగినట్టే. మృతుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే- కొత్తగా 717 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 76,51,108కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,40,090గా నమోదైంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 67,95,103కు చేరుకుంది. మొత్తం మరణాలు 1,15,914గా నమోదు అయ్యాయి.
పండుగల సీజన్ వచ్చిందని, అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించిన మరుసటి రోజే కరోనా వైరస్ రోజువారీ కేసులు భారీగా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లాక్డౌన్ ముగిసిందే కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, దాని మీద దేశ ప్రజలు తమ పోరాటాన్ని ఇంకా కొనసాగించాల్సి ఉందనీ ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. పండుగల సీజన్ ఆరంభమైనందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదంటూ ఆయన హెచ్చరించారు. ఆ మరుసటి రోజే కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం.. ప్రధాని హెచ్చరికలను నిజం చేసినట్టయింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు 9,72,00,379 పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 10,83,608 కరోనా నిర్దారణ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొంది. వరదల వల్ల ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం మందగించినట్లు ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు.