పొంచివున్న థర్డ్వేవ్: సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం: 60 వేలకు దిగువగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60 వేలకు దిగువగా నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు తగ్గడం 81 రోజుల తరువాత ఇదే తొలిసారి. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. ఫలితంగా- తాజాగా తెలంగాణ లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేయగా.. కర్ణాటక మరింత సడలించింది. అయినప్పటికీ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అక్టోబర్లో థర్డ్వేవ్ పొంచివున్నట్లు నిపుణులు హెచ్చరిస్తోన్నారు. కరోనా ప్రొటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 58,419 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,576 మంది మరణించారు. 87,619 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 60 వేలకు దిగువగా రోజువారీ కొత్త కేసులు నమోదు కావడం 81 రోజుల తరువాత ఇదే తొలిసారి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,98,81,965కు చేరింది. ఇందులో 2,87,66,009 మంది కోలుకున్నారు. 3,86,713 మంది మృత్యువాత పడ్డారు.
Recommended Video
యాక్టివ్ కేసుల సంఖ్య 7,29,243గా నమోదైంది. ఇప్పటిదాకా 27,66,93,572 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది. రికవరీ రేటు 96.27 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు శాతం అయిదుకు దిగువకే నమోదైంది. తాజాగా ఈ సంఖ్య 3.43గా నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం అదే స్థాయిలో ఉంటోంది. 3.22 శాతంగా నమోదైనట్లు చెప్పారు.
కాగా- దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. శనివారం ఒక్కరోజే 18,11,446 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం కరోనా టెస్టింగుల సంఖ్య 39,10,19,083కు చేరింది. ఇదివరకు రోజువారీ టెస్టింగుల సంఖ్య 19 నుంచి 20 లక్షల వరకు నమోదయ్యాయి. అదే దూకుడును కొనసాగిస్తోంది ఐసీఎంఆర్. 18 లక్షలకు పైగా టెస్టింగులను నిర్వహించిన సందర్భంలో కొత్త కేసులు 58 వేలకు నమోదు కావడం ఊరటనిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది.