దేశంలో మూడువేలను దాటిన కరోనా మరణాలు.. మూడు కోట్లకు చేరువగా కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. లక్షకు లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు కోట్లకు చేరువ అవుతోంది. డిశ్చార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటోన్నాయి. మరణాల్లో మాత్రం ఆ వేగం తగ్గట్లేదు.. తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదు. మరోసారి మూడువేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోన్నప్పటికీ- అదే తరహా పరిస్థితులు మరణాల్లో కనిపించకపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 80,834 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,303 మంది మరణించారు. 1,32,062 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. 10 లక్షలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989కి చేరింది. ఇందులో 2,80,43,446 మంది కోలుకున్నారు. 3,70,384 మంది మృత్యువాత పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది భారత్. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 10,26,159గా నమోదైంది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 25,31,95,048 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది. రోజువారీ కేసులు 80 వేలకు నమోదు కావడం 71 రోజుల తరువాత ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా నమోదైంది. 20 రోజులుగా వరుసగా 10 శాతానికి దిగువకు ఈ సంఖ్య నమోదవుతూ వస్తోంది.
జాతీయ స్థాయిలో కరోనా రికవరీ రేటు 95.26 శాతంగా రికార్డయింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్లో హాట్స్పాట్లుగా మారిన రాష్ట్రాల్లో దాని తీవ్రత తగ్గిన ఫలితం.. జాతీయ గణాంకాలపై పడుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఏపీ వంటి రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యేవి. ఆయా రాష్ట్రాల్లో రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. ఫలితంగా సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లో కొనసాగిన ఆయా రాష్ట్రాలన్నీ క్రమంగా అన్లాక్ను చేపట్టాయి.