ఎక్కడా తగ్గట్లేదుగా: మళ్లీ అరలక్షకు మించి: 28% యాక్టివ్: వైరస్ కాటుకు 45 వేల మందికి పైగా బలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వల్ల నెలకొన్న భయానక పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయే తప్ప.. పూర్తిగా సమసిపోని పరిస్థితులు ఉన్నాయి. కరోనా వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోవుతుండగా.. అదే ఉధృతి ఇంకా కొనసాగుతోనే వస్తోంది. ఎక్కడా తగ్గట్లేదనిపించేలా మహమ్మారి విస్తరిస్తోంది. కొత్త ప్రాంతాల్లో విస్తరించడం ఆందోళన కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఏపీలో ఇసుక ధరలు ఫిక్స్: కొత్త రేట్లు ఇవే: టన్నుకు ఎంత వసూలు చేస్తారంటే?
కొత్తగా 53 వేలకు పైగా కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 53,601 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకు నమోదైన సంఖ్యతో పోల్చుకుంటే.. ఇది కాస్త తక్కువే. ఇదివరకు 62 వేలకు పైగా రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాటికి ఈ సంఖ్య 53 వేలకు పడిపోయింది. అంతే గానీ గణనీయ మార్పులేవీ చోటు చేసుకోలేదు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ఇవే తరహా పరిస్థితులు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా కల్లోలంలోనూ దేశ ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలకు అలవాటు పడ్డారు.
45 వేలు దాటిన మరణాలు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 53,601 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 871 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 22,68,676కు చేరుకుంది. ఇప్పటిదాకా 45,386 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,39,929కి చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 15,83,490కి చేరింది.
28 శాతం యాక్టివ్ కేసులు..
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశంలో యాక్టివ్ ఉన్న కేసుల సంఖ్య 28 శాతానికి చేరుకుంది. 69.80 శాతం డిశ్చార్జిలు నమోదు అయ్యాయి. డెత్ పర్సెంటేజ్ రెండు శాతానికి చేరువగా ఉంది. ప్రస్తుతం 1.99 శాతం మరణాల శాతం నమోదైనట్లు అధికారులు తమ బులెటిన్లో వెల్లడించారు. ఇదివరకు గరిష్ఠంగా 2.50 శాతం వరకు మరణాల శాతం నమోదు కాగా.. అది కాస్తా రెండు కంటే దిగువకు చేరుకుంది. 1.99 శాతంగా నమోదైంది. మున్ముందు మరణాల రేటు మరింత క్షీణించే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.
Recommended Video
శాంపిళ్ల పరీక్షలోనూ
దేశవ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. సోమవారం ఒక్కరోజే 6,98,290 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన కరోనా నమూనా పరీక్షల సంఖ్య 2,52,81,848కి చేరుకుంది. కరోనా వైరస్ టెస్టింగులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీలను కేంద్రం ఏర్పాటు చేసింది.