మరింత బలపడ్డ కరోనా: పాత లెక్కలను తిరగరాసిన కొత్త కేసులు: 56 వేలకు పైగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత బలపడింది. ఒక్కసారిగా పెరిగింది. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. రోజురోజుకు, గంటగంటకూ కరోనా లెక్కలు మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పాత లెక్కలను తిరగరాస్తున్నాయి. మరణాల సంఖ్యలోనూ ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. మరణాల సంఖ్య భారీగా కొనసాగుతుండటం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా 40 వేల మందికిపైగా ఈ మహమ్మారికి బలి అయ్యారు.
ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: 67 మంది మృతి, లక్షా 86వేలకుపైగానే..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 56,282 కేసులు వెలుగులోకి వచ్చాయి. 904 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,64,537కు చేరుకుంది. 40,699 మంది మరణించారు. ఊహించినట్టే..24 గంటలు గడిచే సరికి కరోనా మరణాలు 40 వేలను దాటుకున్నాయి. మరింత భయపెట్టేలా పెరుగుదల బాట పట్టాయి. దేశవ్యాప్తంగా డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 13 లక్షలను దాటింది. ఇప్పటిదాకా 13,28,337 మంది డిశ్చార్జి అయ్యారు.
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,244గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేసింది. రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత బుధవారం వరకు 2,21,49,351 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 6,64,949 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పెద్దసంఖ్యలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు.
Recommended Video
ఏపీ, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చోటు చేసుకున్న పెరుగుదల ప్రభావం దేశవ్యాప్త రోజువారీ సంఖ్య పడింది. ఫలితంగా- 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 56 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో 24 గంటల్లో కొత్తగా 10,128 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,86,461 చేరింది. అదే తరహా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రంలో 10,309 కేసులు నమోదు అయ్యాయి. అక్కడి కేసుల సంఖ్య 4 లక్షల 70 వేలకు చేరువ అయ్యాయి.