చెలరేగుతోన్న కరోనా: ఒక్కరోజే వెయ్యిమందికి పైగా బలి: రికార్డు స్థాయిలో మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తన కల్లోలాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా 62 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 62,064 కేసులు రికార్డు అయ్యాయి. మరణాల సంఖ్యలోనూ ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. ఇదివరకు నమోదైన సంఖ్యతో పోల్చుకుంటే.. మరణాల సంఖ్య భారీగా పెరిగింది. వెయ్యిని దాటింది. ఒక్కరోజే 1007 మరణాలు నమోదు అయ్యాయి.
Recommended Video
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 62,064 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 22,15,075కు చేరుకుంది. 44,386 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,34,945కు చేరుకుంది.
డిశ్చార్జి అయిన వారి సంఖ్య 15,35,744కు చేరుకుంది. రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత గురువారం నాటికి 2,45,83,558 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
ఆదివారం ఒక్కరోజే 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పెద్దసంఖ్యలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో వరుసగా అయిదోరోజూ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీ సహా ఆయా రాష్ట్రాల్లో నమోవుతోన్న రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ప్రభావం వల్ల జాతీయ స్థాయి కరోనా వైరస్ పాజిటివ్ అంకెలపై పడుతోంది. ఇదివరకు తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రెండువేలకు పైగా నమోదు అయ్యాయి. తాజాగా వాటి సంఖ్య తగ్గింది.