కరోనా కొత్త రికార్డు: దిమ్మ తిరిగేలా: ఒక్కరోజే 62 వేలకు పైగా: 20 లక్షలను దాటి: భయానకంగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత బలపడింది. ఒక్కసారిగా పెరిగింది. కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. రోజురోజుకు, గంటగంటకూ కరోనా లెక్కలు మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పాత లెక్కలను తిరగరాస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో దేశవ్యాప్తంగా 62 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 62,538 కేసులు రికార్డు అయ్యాయి. మరణాల సంఖ్యలోనూ ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 41 వేలను దాటేశాయి.
మూడు వారాల్లోనే 10 లక్షల కొత్త కరోనా కేసులు: 20 లక్షలకు చేరిక, ఐనా దేశం కోలుకుంటోంది!
62 వేల కేసులతో..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 62,538 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 886 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరుకుంది. 41,585 మంది మరణించారు. కరోనా కేసుల్లో ఈ స్థాయిలో పెరుగుదల ఊహించలేనిదే. ఇదివరకు 50 వేలకు కాస్త అటు, ఇటుగా నమోదు అయ్యాయి పాజిటివ్ కేసులు. ఆ తరువాత 52 వేల నుంచి 55 వేల మధ్యలో తరచూ నమోదవుతూ వచ్చాయి. ఈ సారి మాత్రం భారీగా పెరుగుదల కనిపించింది. 62 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే తాజా బులెటిన్ను విడుదల చేసింది.
యాక్టివ్ కేసుల్లోనూ
దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల్లో కూడా అనూహ్య పెరుగుదల నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలను దాటుకుంది. ఇప్పటిదాకా దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,07,384కు పెరిగింది. అటు డిశ్చార్జిల సంఖ్యలోనూ గణనీయమైన మార్పు కనిపిస్తోంది. అయినప్పటికీ..రోజువారీ కొత్త కేసుల నమోదులో చోటు చేసుకుంటోన్న పెరుగుదల వల్ల పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శాంపిళ్ల నమోదులోనూ అదే వేగం..
రోజువారీ కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత గురువారం నాటికి 2,27,24,134 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 5,74,783 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పెద్దసంఖ్యలో కరోనా వైరస్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు.
Recommended Video
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ వంటి చోట్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చోటు చేసుకున్న పెరుగుదల ప్రభావం దేశవ్యాప్త రోజువారీ సంఖ్య పడింది. ఫలితంగా- 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 62 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో 24 గంటల్లో కొత్తగా 10,328 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,894 చేరింది. అదే తరహా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో వెలుగులోకి వచ్చాయి.