కరోనావైరస్: భారత్లో ఏడుకు చేరిన మరణాలు, ఒక్కరోజే మూడు
న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మనదేశంలో ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బీహార్, తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరణాలు సంభవించాయి. సూరత్లో చికిత్స పొందుతున్న 69ఏళ్ల వ్యక్తి మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరగా, ఆదివారం ఒక్క రోజే ఐదు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, బీహార్కు చెందిన 38ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. పాట్నాలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. దేశంలో మరణించినవారిలో పిన్నవయస్కుడు ఇతడే కావడం గమనార్హం.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 300 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశంలోని ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపారు.
అంతేగాక, కరోనాపై పోరులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర విభాగాలవారికి సంఘీభావం తెలిపిందుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజల తమ ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ ప్రజలంతా ముందుకు వచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ తమ ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.