మాల్యా ఆఖరి అస్త్రం... ముందే అలర్ట్ అయిన భారత్.. బ్రిటన్తో టచ్లో...
భారతీయ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి, బ్రిటన్ పారిపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాను భారత్కు అప్పగించే వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మాల్యా చివరి ప్రయత్నంగా శరణార్థి అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ మాల్యా అభ్యర్థనను అంగీకరించవద్దని ముందుగానే బ్రిటన్ను కోరింది. ఒకవేళ శరణార్థిగా తనకు ఆశ్రయం కల్పించాలని మాల్యా అప్పీల్ చేస్తే.. దాన్ని తిరస్కరించాలని కోరింది.
అనురాగ్ శ్రీవాస్తవ ఏమంటున్నారు..
విజయ్ మాల్యాను వీలైనంత త్వరగా భారత్ రప్పించేందుకు బ్రిటన్ అధికారులతో టచ్లో ఉన్నామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. శరణార్థిగా తలదాచుకునేందుకు మాల్యాకు ఆశ్రయం కల్పించవద్దని కోరామన్నారు. భారత్లో తనను వేధిస్తారని మాల్యా చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేనందునా.. అతని అప్పీల్ను నిరాకరించాలని కోరినట్టు తెలిపారు.
కాగా,తనను భారత్ కు అప్పగించాలన్న పిటిషన్ను సవాలు చేస్తూ గత నెలలో విజయ్ మాల్యా లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే మాల్యాకు అక్కడ చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరగా.. అనుమతి లభించలేదు.
మాల్యా పిటిషన్కు చుక్కెదురు..
మాల్యా పిటిషన్లకు హైకోర్టులో చుక్కెదురవడం.. సుప్రీంలో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి నిరాకరించడంతో.. ఆయన్ను భారత్కు అప్పగించడం ఖాయమేనని చాలామంది భావించారు. అయితే మాల్యాను భారత్కు అప్పగించాలంటే కొన్ని చట్టపరమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.బ్రిటన్ చట్టాల ప్రకారం.. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అప్పగింత ప్రక్రియ సాధ్యం కాదని, ఇంతకు మించి వివరాలు చెప్పలేమని అన్నారు.
శరణార్థిగా అప్పీల్ చేసుకుంటే..
బ్రిటన్ చట్టాల ప్రకారం అక్కడి సుప్రీం కోర్టు లేదా హైకోర్టు ఎవరైనా వ్యక్తిని ఇతర దేశాలకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేస్తే.. 28 రోజుల్లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ ఆ వ్యక్తి.. తనకు శరణార్థిగా దేశంలో ఆశ్రయం కల్పించాలని అప్పీల్ చేసుకుంటే... అది తేలేంతవరకు అప్పగింత సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మాల్యా శరణార్థిగా అప్పీల్కు వెళ్లే అవకాశం లేకపోలేదు. దీంతో ముందుగానే అప్రమత్తమైన భారత్.. మాల్యాకు ఆవిధమైన మినహాయింపులేవి ఇవ్వవద్దని బ్రిటన్ను కోరింది. అయితే మాల్యా శరణార్థిగా ఆశ్రయం కల్పించేందుకు అప్పీల్ చేసుకున్నారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.