చైనా సైనికుడ్ని తిరిగి అప్పగించిన భారత్: నాలుగు నెలల్లో రెండోసారి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ జవానును భారత సైన్యం సోమవారం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. గత శుక్రవారం తెల్లవారుజామున ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వైపు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని మన బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
అయితే, దర్యాప్తులో అతడు ఉద్దేశపూర్వకంగా భారత భూభాగంలోకి రాలేదని అధికారులు ధృవీకరించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీంతో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తూర్పు లడఖ్లోని చుషుల్-మోల్దో సరిహద్దుల వద్ద ఆ జవానును చైనా బలగాలకు అప్పగించినట్లు తెలిపాయి.
కాగా, చైనా జవాను గత నాలుగు నెలల్లో భారత భూభాగంలోకి రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత అక్టోబర్ నెలలో తూర్పు లడఖ్లోని డెమ్చోక్ సెక్టారులో పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల తర్వాత ఆ జవానును తిరిగి చైనాకు అప్పగించారు.
లడఖ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం అనుమానాలకు తావిస్తోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో గత మే నెల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నెలలో గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. చైనా బలగాల దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది.