డీల్ డన్ : భారత్ రష్యాల మధ్య మరో భారీ ఒప్పందం..నాలుగు యుద్ధనౌకల కొనుగోలుకు సిద్ధం
ఢిల్లీ: భారత్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ పర్యటన సందర్భంగా భారత్-రష్యాల మధ్య 5 బిలియన్ డాలర్లతో ఇప్పటికే ఎస్-400 క్షిపణిల కొనుగోలుకు ఒప్పందం జరగనుంది. తాజాగా మరో నాలుగు క్రివాక్ యుద్ధనౌకలను కొనుగోలు చేసేందుకు 2.5 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకోనుంది భారత్. ఈ ఒప్పందంతో భారత నేవీ మరింత బలపడనుంది. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య జరగనున్న సంయుక్త సమావేశంలో ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని పాలెం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో విమానం దిగనున్నారు. భారత్ కొనుగోలు చేయనున్న ఈ నాలుగు యుద్ధనౌకల్లో రెండిటిని కలినిన్గ్రాడ్లోని యంతర్ షిప్యార్డ్లో తయారు చేయనుండగా మరో రెండిటిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో తయారు చేయనున్నారు. 2016లోనే భారత్ రష్యాలు ఇంటర్ గవర్నమెంట్ అగ్రీమెంట్లో భాగంగా యుద్ధనౌకల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇప్పటి వరకు భారత నేవీలో ఆరు యుద్ధనౌకలున్నాయి. ఇందులో మూడు తల్వార్ క్లాస్కు చెందిన యుద్ధ నౌకలుండగా మరో మూడు టెగ్ క్లాస్కు చెందిన వార్షిప్లు.ఇవన్నీ రష్యా నుంచే కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఇవి భారత నేవీలోకి 2003 మధ్య నుంచి 2013 మధ్యలో చేరాయి.
వాస్తవానికి యుద్ధ సామగ్రికి సంబంధించి ఆయుధాల కొనుగోలు, పేలుడు సామగ్రి చాలా వరకు రష్యా నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అమెరికా ఆంక్షలు విధించడంతో అమెరికాతో చర్చలు జరపాలని భారత్ భావిస్తోంది. భారత త్రివిధ దళాలకు చెందిన యుద్ధ సామగ్రి చాలావరకు రష్యాకు సంబంధించిందే అన్న విషయం అమెరికాకు భారత్ తెలియజేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు అమెరికా ఆంక్షలు వీటికి వర్తించదని ఆర్మీ ఛీఫ్ బీఎస్ ధనోవా చెప్పారు. అంతేకాదు ఒప్పందం కుదుర్చుకున్న రెండేళ్లకు యుద్ధవిమానాలు ఆర్మీకి సేవలందిస్తాయని చెప్పారు. మరోవైపు భారత్ ఒక్క రష్యాతోనే జతకడుతోంది కాబట్టి అమెరికా ఆంక్షలను తొలగించే అవకాశం ఉందని మాజీ విదేశీ కార్యదర్శి శశాంక్ తెలిపారు.