పాక్, చైనాకు కలవరమే: రష్యాతో భారత్ ‘ఎస్-400’ ఒప్పందం!
న్యూఢిల్లీ/మాస్కో: ఈ వార్త దయాది దేశమైన పాకిస్థాన్, స్నేహం నటిస్తూనే కుట్ర చేస్తున్న చైనాలకు మింగుడుపడదు. ఎందుకంటే.. భారత సైన్యం అమ్ములపొదిలో ఆధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యాన్ ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయ ఒప్పందంపై భారత్, రష్యా త్వరలోనే సంతకాలు చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ విషయంపై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు రష్యా రక్షణ, పరిశ్రమల బృందం(రోస్టెక్) డైరెక్టర్ విక్టర్ ఎన్ క్లడోవ్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ ఎన్ని ఎస్-400లను కొనుగోలు చేస్తుందన్న విషయంపై చర్చలు సాగుతున్నాయని చెప్పారు.
రెండేళ్ల ట్రైనింగ్ తర్వాతే..
‘ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్-400లను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణ ఇచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. అప్పుడే వీటిని వినియోగించగలరు' అని క్లడోవ్ వివరించారు.
డిఫెన్స్ సిస్టమ్: హెలికాప్టర్ల తయారీ
రష్యా నుంచి 5బిలియన్ డాలర్లతో ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తామని గత సంవత్సరం అక్టోబర్లో భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్ హెలికాప్టర్ల తయారీ చేపడతాయని పేర్కొంది. గోవాలో బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించిన తర్వాత ఈ ఒప్పందం గురించి ప్రకటించారు.
ఎస్-400 అత్యంత శక్తివంతం
కాగా, ఎస్-400 ట్రయంప్ లాంగ్రేంజ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది కావడం గమనార్హం. ఆకాశంలో 400 కిలోమీటర్ల పరిధిలో దూసుకొచ్చే శత్రుదేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ఇది నాశనం చేయగలదు. దీంతో మొత్తం మూడు క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంటుంది.
ఒకేసారి 36లక్ష్యాలు... భారత నగరాలకు రక్షణ ఛత్రమే..
అంతేగాక, రక్షణ పొరలాంటిది సృష్టించి ఒకేసారి 36లక్ష్యాలను గురిపెట్టగలదు. శత్రుదేశాల క్షిపణుల నుంచి దేశంలోని ముఖ్య నగరాలను నాశనం కాకుండా రక్షణ ఛత్రం ఏర్పాటు చేయవచ్చు. కాగా, ఇలాంటి వ్యవస్థ అమెరికా వద్ద కూడా లేకపోవడం గమనార్హం.
పాక్, చైనాలకు కలవరమే..
ఈ ఒప్పందం కుదిరి ఎస్-400లు భారత్ చేరితే మాత్రం మన రక్షణ వ్యవస్థ మరింత దృఢంగా తయారవుతుంది. దీంతో, ఎప్పుడూ భారత్పై కుట్రలు చేస్తున్న పాకిస్థాన్, చైనాలకు ఈ పరిణామం కలవరానికి గురిచేయడం ఖాయం.