ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసే అవార్డు: 3 ఇడియట్స్కు అతను స్ఫూర్తి
మనీలా: ఆసియా నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ప్రకృతి, సంస్కృతి, విద్యాలతో సామాజిక పురోగతి సాధ్యమని సోనమ్ వాంగ్చుక్, సమాజం చిన్నచూపు చూసిన వారికి ఆరోగ్యంతో పాటు గౌరవాన్ని కూడా కల్పించేందుకు కృషి చేసిన డాక్టర్ భరత్ వత్వానీలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.
వివిధ దేశాలకు చెందిన మరో నలుగురిని ఈ అవార్డు వరించింది. ఆగస్ట్ 31వ తేదీన అవార్డులను బహూకరిస్తారు. సామాజిక రంగంలో భరత్ వత్వానీకి, కమ్యూనిటీ లీడర్ షిప్ రంగంలో సోనమ్కు ఈ అవార్డు వచ్చింది. శాంతి విభాగంలో పిలిప్సైన్ మాజీ దౌత్యాధికారి హోవార్డ్ డీని కూడా ఎంపికయ్యారు.
డాక్టర్ భరత్
డాక్టర్ భరత్ వత్వానీ తన భార్యతో కలిసి 1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ ప్రారంభించారు. వీధుల్లో తిరిగే మానసిక వ్యాధిగ్రస్తులను చేరదీసి ఉచిత వసతి, చికిత్స అందించి తిరిగి వాళ్లను కుటుంబాల వద్దకు చేర్చుతారు. వీధుల్లో సంచరించే మానసిక వికలాంగులను గుర్తించేందుకు సామాజిక కార్యకర్తలు, పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. తాము కాపాడి తీసుకు వచ్చిన వారికి వ్యక్తిగత శుభ్రత, వైద్య పరీక్షలు, తగిన మందులు అందజేయడం.. ఇవన్నీ దంపతులు దగ్గరుండి చూసుకుంటారు.
వాంగ్చుక్
1988లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన సోను వాంగ్చుక్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ (ఎస్ఈసీఎంఎల్) స్థాపించి ఆ ప్రాంతంలోని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 1994లో ఆపరేషన్ న్యూ హోప్ అనే ప్రాజెక్టును ప్రారంభించి 700 మంది ఉపాధ్యాయలకు, 1000 వీఈసీ లీడర్లకు శిక్షణ ఇచ్చారు. దీంతో 1996లో ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతాన్ని 2015 నాటికి 75 శాతానికి తీసుకు వచ్చారు. 95 శాతం ఫెయిలయ్యే లడఖ్ విద్యార్థులకు సానబెట్టారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 3 ఇడియట్స్ సినిమాకు సోనమ్ వాంగ్చుక్ స్ఫూర్తి.